Will Resign If Bjp High Command Asks Me Karnataka Cm Bs Yediyurappa
Karnataka CM కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారంటూ ఇటీవల రాష్ట్రంలో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఇటీవలే రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ ఢిల్లీకి పయనం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్, బసనగౌడ పాటిల్ యత్నాల్ సహా పలువురు నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నారని తెలిసింది. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కునే విషయంలో ప్రభుత్వం నిర్ణయాలపైనా కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మార్పు తప్పకుండా ఉంటుందనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు వదంతులపై యడియూరప్ప ఆదివారం మౌనం వీడారు. హైకమాండ్ నిర్ణయమే తన నిర్ణయమని యడియూరప్ప సృష్టం చేశారు. అధిష్ఠానం చెబితే సీఎం పదవి నుంచి వైదొలిగేందుకు క్షణం కూడా ఆలోచించనని అన్నారు.
ఆదివారం యడియూరప్ప మాట్లాడుతూ..హైకమాండ్ నాపైన విశ్వాసముంచినంతవరకు నేనే సీఎం. ఒకవేళ హై కమాండ్ సీఎంగా తప్పుకోవాలని చెబితే.. వెంటనే పదవికి రాజీనామా చేసి రాష్ట్రం కోసం పనిచేస్తా. పార్టీలో భిన్నాభిప్రాయలేమీ లేవు. హైకమాండ్ నాపై పూర్తి నమ్మకంతోనే సీఎం పదవి అప్పజెప్పింది. ఇక తుది నిర్ణయం అదిష్ఠానం చేతుల్లోనే ఉంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నాయకులు లేరన్న వాదనలతో తాను ఏకీభవించను అని యడియూరప్ప అన్నారు. కానీ, బీజేపీ అధిష్ఠానం నాపై పూర్తి నమ్మకంతో ఉందని యడియూరప్ప తెలిపారు. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండబోదని బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే పలుమార్లు తెలిపింది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్ నారాయణ్ ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ.. యడియూరప్ప సీఎంగా తప్పుకుంటారనే పశ్నే లేదు. అసలు ఈ విషయంపై ఎక్కడా చర్చలు జరగటంలేదు. పార్టీకి ఆయన ఓ సైనికుడి లాంటి వారు. అందుకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరిస్తా అని చెప్పారు. మరోవైపు, కర్ణాటక ముఖ్యమంత్రి తొలగింపు వార్తలపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి…యడియూరప్పను సీఎంగా తొలగించే ఉద్దేశమే బీజేపీకి లేదని స్పష్టం చేశారు.