ఢిల్లీలో విషాద ఘటన.. మ్యాన్హోల్లోపడి తల్లీ, కొడుకు మృతి.. మరణంలోనూ కొడుకు చేతిని వదలని తల్లి
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 23ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు మ్యాన్ హోల్ లోపడి మృతి చెందారు.
- Harishth Thanniru
- Published On : August 1, 2024 / 01:03 PM IST
mother and son Fall Into Open Drain
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 23 ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఘాజీపూర్ లోనూ రహదారిపై నీరు చేరింది. వర్షం పడిన సమయంలో తనూజ బిష్త్ అనే మహిళ తన మూడేళ్ల ప్రియాంష్ తో కలిసి ఘాజీపూర్ లోని వారాంతపు సంతకు వెళ్లింది. సంతలో సరుకులు తీసుకొని వస్తున్న క్రమంలో రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో రోడ్డుపై మ్యాన్ హోల్ తెరుచుకొని ఉండటంతో దానిని గమనించని మహిళ మూడేళ్ల చిన్నారితో కలిసి అందులో పడిపోయింది.
Also Read : ఢిల్లీలో రెడ్అలర్ట్ జారీ.. మూతపడ్డ పాఠశాలలు.. పలు విమానాలు రద్దు
అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ద్వారా తల్లీ, కుమాడ్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే వారు మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన గంట తరువాత రెండు మృతదేహాలను మ్యాన్ హోలో పడిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో గుర్తించారు. అప్పటికీ తల్లి తన కొడుకు చేతిని పట్టుకొని ఉంది. తన బిడ్డను కాపాడుకొనేందుకు ఆమె ఎంతస్థాయిలో ప్రయత్నించిందో ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది.
Also Read : భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. మాజీ క్రికెటర్ కన్నుమూత.. ప్రధాని మోదీసహా జైషా, గంగూలీ సంతాపం
గత మూడు నెలలుగా ఈ డ్రెయిన్ తెరిచి ఉందని, పలుసార్లు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్ మూసి ఉంటే తల్లీ, బిడ్డ ఇద్దరూ బతికిఉండేవారని స్థానికులు తెలిపారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వారిద్దరూ మరణించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
