Bengaluru: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ కొడుకు మృతి
మంగళవారం ఉదయం తేజస్వని-లోహిత్ దంపతులు, వాళ్ల పిల్లలు ఇద్దరితో కలిసి నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కింది నుంచి బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణానికి ఉపయోగించే అత్యంత బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది.
- Narender Thiru
- Published On : January 10, 2023 / 03:34 PM IST
Bengaluru: కర్ణాటక, బెంగళూరులో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఒక మహిళ, ఆమె మూడేళ్ల కొడుకు మరణించాడు. మహిళ భర్త, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని నాగవార ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది.
ఘటనకు సంబంధించి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం తేజస్వని-లోహిత్ దంపతులు, వాళ్ల పిల్లలు ఇద్దరితో కలిసి నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కింది నుంచి బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణానికి ఉపయోగించే అత్యంత బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది. దీంతో దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ తేజస్వని, ఆమె కొడుకు విహాన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
తేజస్వని భర్త లోహిత్, ఆమె కూతురు చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో తేజస్విని, లోహిత్ ఇద్దరూ హెల్మెట్లు ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. వాళ్ల పిల్లలు ఇద్దరూ కవలలు అని అధికారులు చెప్పారు.
