Yaas Cyclone Heavy Rains In Kolkata
Heavy Rains In Kolkata : పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతాను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. అటు దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పెద్దఎత్తున తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
యాస్ తుపాను బీభత్సంతో ఒడిశా, బెంగాల్ తీరాల్లోని పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా న్యూ దిఘా వద్ద సముద్రం ఉప్పొంగింది. సునామీని తలపించేలా సముద్రపు నీరు ఊళ్లోని నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోనూ సముద్రం ఉప్పొంగి తీరంలోని ఇళ్లను, నివాస సముదాయాలను ముంచెత్తింది.
తుపాను హెచ్చరికల కారణంగా పలు రైళ్ల రద్దయ్యాయి. భారత నావికాదళం సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేవీ డైవింగ్ బృందాలు, అవసరమైన సామగ్రి, పడవలతో ప్రత్యేక సిబ్బందితో కూడిన వరద సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. కోల్కతాలోని హౌరా బ్రిడ్జి వద్ద నీరు ఉవ్వేత్తున్న ఎగిసిపడుతోంది. దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఆయా రాష్ట్రాల విపత్తు నిర్వహణ బృందాలతోపాటు కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తుపాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్, దక్షిణ 24 పరగణ, హౌరా, హుగ్లీ, పురూలియా, బాంకురా, బర్ధమాన్, కోల్కత, బీర్భూమ్, నాదియా, ముర్షీదాబాద్లల్లో తుపాన్ ప్రభావాన్ని చూపుతోంది. ఆయా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాల నుంచి 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read More : Nallamalla Movie : ‘నల్లమల’ లాంటి స్వచ్ఛమైన క్యారెక్టర్లో అమిత్..