Yanam : గోదావరి వరద నీటిలో మునిగిన యానాం
ప్రతిఏడాది వరదలానే భావించి ఇంట్లోనే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. నడుములోతు నీటితో నరకం చూస్తున్నారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటించి పోతున్నారు.
- bheemraj
- Published On : July 18, 2022 / 08:51 AM IST
Yanam
Yanam submerge : మహోగ్ర గోదావరి యానాం ప్రజల్ని బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. వరద నీరు అక్కడి ప్రజలకు కన్నీరును తెప్పిస్తోంది. ప్రతిఏడాది వరదలానే భావించి ఇంట్లోనే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. నడుములోతు నీటితో నరకం చూస్తున్నారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటించి పోతున్నారు. గూడుచెదిరిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ నుండి 25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో గౌతమి గోదావరి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. గోదావరి నది పరివాహక ప్రాంతమైన కాకినాడ జిల్లాలో.. అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మునుపెన్నడూ లేని విధంగా ముంపు బారిన పడింది. భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. గోదావరి పాయ అయిన గౌతమీ నది ఉద్ధృతితో యానాంలో కాలనీలు నీట మునిగాయి. పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది.
Heavy Rains : నేడు తెలంగాణలో భారీ వర్షాలు
అడుగు బయట పెట్టలేని పరిస్థితి..పెడితే మెడవరకు వస్తున్నవరదప్రవాహం. ఎటు చూసినా వరద నీరే…చెరువులను తలపిస్తున్న రోడ్లు. అంతా రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ప్రశాంతంగా నిద్రపోయిన ప్రజలపై వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. అర్ధరాత్రి నీరు రావడంతో ఉలిక్కి పడిన ప్రజలు… సూర్యోదయం వరకు బిక్కుబిక్కుమంటు…గోడలు, డాబాలపై కంటిమీద కునుకు లేకుండా కూర్చున్నారు.
ఆకలితో ఆపన్న హస్తం ఎదురు చూసిన వారికి మాజీ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావుతో పాటు పలు స్వచ్చంద సంస్థలు సహాయం చేస్తున్నా…కొందరికే అందుతున్నాయి. మరోవైపు రంగంలోకి దిగిన NDRF సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
