Ajay Maken: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మొదటి ఎదురుదెబ్బ.. రాజస్తాన్ ఇంచార్జి రాజీనామా
- tony bekkal
- Published On : November 16, 2022 / 03:46 PM IST
Ajay Maken quits as AICC Rajasthan in charge
Ajay Maken: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై నెల రోజులు కూడా కాకముందే మల్లికార్జున ఖర్గేకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్తాన్ ఏఐసీసీ ఇంచార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 25న జైపూర్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ)కి సమాంతర సమావేశాన్ని నిర్వహించినందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు చెందిన ముగ్గురు విధేయులపై చర్యలు తీసుకోవాలని మాకెన్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం పట్ల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసీసీ) ఇన్ఛార్జ్ రాష్ట్ర అజయ్ మాకెన్ రాజీనామా చేశారు.
పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. తన రాజీనామాను నవంబర్ 8వ తేదీనే అధ్యక్షుడు ఖర్గేకు పంపారట మాకెన్. రాజస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్, పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి, రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆర్టీడీసీ) చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాను ఇక ఆ పదవిలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకు పంపిన లేఖలో మాకెన్ పేర్కొన్నట్లు సమాచారం.
మరో రెండు వారాల్లో భారత్ జోడో యాత్ర రాజస్తాన్ రాష్ట్రంలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ రాజీనామా చేయడం పార్టీకి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, మాకెన్ నోటీసులు పంపిన ముగ్గురు నేతలకు రాజస్తాన్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర నిర్వహణ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
G20: ప్రధాని మోదీకి సెల్యూట్ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
