BJP Sting Operation: ఇంజనీర్ నుంచి ఆప్ అభ్యర్థి రూ.కోటి డిమాండ్.. ఆప్పై బీజేపీ సంచలన ఆరోపణలు
పార్టీ నేతలకు గిఫ్ట్లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస్యం కాకుండా ఆయనను పార్టీ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలగించాలని డిమాండ్ చేశారు
- tony bekkal
- Published On : November 18, 2022 / 08:18 PM IST
BJP alleges AAP candidate demands one crore from engineer
BJP Sting Operation: ఆమ్ ఆద్మీ పార్టీపై తరుచూ అవినీతి ఆరోపణలు చేస్తోన్న భారతీయ జనతా పార్టీ.. తాజాగా మరో ముందడుగు వేసి ఏకంగా స్టింగ్ ఆపరేషన్ చేసింది. అనంతరం ఆప్ నేత కోటి రూపాయలు డిమాండ్ చేశాడంటూ ఆరోపణ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ నేత, ఎంసీడీ ఎన్నికల అభ్యర్థి అయిన ముకేష్ గోయెల్ ఒక ఎంసీడీ ఇంజనీర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ వీడియోను శుక్రవారంనాడు విడుదల చేసింది.
పార్టీ నేతలకు గిఫ్ట్లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస్యం కాకుండా ఆయనను పార్టీ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలగించాలని డిమాండ్ చేశారు. 100 నుంచి 150 మంది నాయకులకు దీపావళి బహుమతులు ఇవ్వాలని చెబుతూ డిమాండ్ చేసినట్టు బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర శుక్రవారం మీడియో సమావేశంలో తెలిపారు. కేజ్రీవాల్కు గోయెల్ కుడిభుజం అని, ఆయనను సంప్రదించకుండా ఎంసీడీకి చెందిన ఏ విషయంలోనూ సీఎం నిర్ణయం తీసుకోరని చెప్పారు.
అయితే బీజేపీ విడుదల చేసిన వీడియోను ఆప్ అభ్యర్థి ముకేష్ గోయెల్ తోసిపుచ్చారు. ఇది పూర్తిగా కల్పిత వీడియో అని, ఎంసీడీలో బీజేపీ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాషాయం పార్టీ ఇలాంటి ఎత్తుగడలు పన్నుతోందని ఆయన విమర్శించారు. కల్పిత వీడియో విడుదలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీ ఎంసీడీలో 15 ఏళ్లుగా బీజేపీ అవినీతికి పాల్పడుతోందని, దీనిపై ఢిల్లీ ప్రజలు విసిగెత్తిపోయారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించనున్నారని అన్నారు. ఐదుసార్లు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న గోయెల్ గత ఏడాది నవంబర్లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. డిసెంబర్ 4న జరుగనున్న ఎంసీడీ ఎన్నికల్లో ఆదర్శ్ నగర్ నుంచి ముకేష్ గోయెల్ పోటీ చేస్తున్నారు.
