ముదురుతున్న వివాదం : సీపీకి బండి సంజయ్ 9 ప్రశ్నలు

  • Publish Date - January 23, 2020 / 07:48 AM IST

కరీంనగర్ జిల్లాలో సీపీ కమలహాసన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సంజయ్ మధ్య వివాదం ముదురుతోంది. తనపై రాళ్ల దాడి జరగడం అవాస్తమంటూ..సీపీ ప్రకటించడంపై సంజయ్ మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా సీపీ కమలహాసన్ రెడ్డికి బండి సంజయ్ 9 ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్న తనపై దాడి జరిగితే..కనీసం సంప్రదించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

1. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన రాళ్ల దాడి ఘటన అవాస్తవమని సీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించడం సరికాదు. ఎలాంటి దాడి జరగక పోతే 2 రోజుల క్రితం భద్రత పెంపు, బాంబు స్క్వాడ్ కేటాయింపునకు కారణం ఏంటో సీపీ సమాధానం చెప్పాలి.
2. భద్రత పెంచాలంటూ ఎలాంటి దరఖాస్తు చేసుకోనప్పటికీ భద్రత పెంచడానికి కారణం ఏంటో చెప్పాలి. ఒకవేళ సాధారణ భద్రత పెంపులో భాగంగానే అదనపు బలగాలను కేటాయిస్తే ప్రచారం ముగియడానికి మూడు రోజుల ముందు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో 
సీపీ ఆలోచించుకోవాలి.
3. దుండగుల దాడిలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ పైన కూడా రాళ్లు పడిన విషయం cpkarimnagar తెలియదా ? రాళ్లను కూడా రికవరీ చేయడం వాస్తవం కాదా ? శర్మనగర్‌లోని పోచమ్మ గుడి ముందు రాళ్ల దాడి జరిగినా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతో బయట పెట్టలేదు. 

Read More : న్యాయం కోనాలా : ముకుల్ రోహత్గికి రూ. 5 కోట్లు చెల్లింపు – బాబు

4. ప్రజలు భయబ్రాంతులకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే రాళ్ల దాడి ఘటనను గోప్యంగా ఉంచాం. దాడి జరిగిన సమయంలో చుట్టూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నందున గొడవలు జరగకుండా సంయమనం పాటించాం.
5. రాళ్ల దాడి జరిగిన సమయంలో ఈ విషయాన్ని కార్యకర్తలకు తెలిపి, ఆందోళనకు దారి తీసేలా చేయడం కరెక్టా ? సంయమనం పాటించడం కరెక్టా ? ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. భద్రత పెంచిన నేపథ్యంలో మీడియా మిత్రుల ద్వారా రాళ్ల దాడి అంశం బయటకు వచ్చింది.
6. దాడి అంశంపై తనకు ఫోన్ చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత cpkarimnagar లేదా? తనతో మాట్లాడకుండా పత్రికా ప్రకటన ఎలా విడుదల చేస్తారు ? పోలింగ్‌కు ముందు కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయడం కోసమే సీపీ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Read More : అత్యంత ధనవంతుడు బాబు : రూ. 186 కోట్లు – వరప్రసాద్

7. ఎలాంటి దాడి జరగలేదని పరిస్థితులు అన్నీ సవ్యంగానే ఉన్నాయని 
cpkarimnagar ప్రకటించారు కాబట్టి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపాను. అదనపు భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత గన్ మ్యాన్‌లను వెనక్కి పంపాను.
8. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ కార్యకర్తలను బెదిరించడం కోసం పత్రికా ప్రకటన విడుదల చేయడం సీపీకి అలవాటుగా మారింది. పార్లమెంటు సభ్యుడిగా తనను ఉద్దేశించి ప్రకటన విడుదల చేసే ముందు కనీసం సంప్రదించక పోవడం ఎంత వరకు సమంజసం ?
9. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా సీపీ కమలాసన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన తనపై అధికార పార్టీ ప్రతినిధి తరహాలో సీపీ అత్యుత్సాహం తో కూడిన ప్రకటనలు చేయడం మానుకుంటే మంచిది. అంటూ బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 
 

అసలు ఏం జరిగింది : – 
నాలుగు రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. 
కిసాన్ నగర్ లో రాళ్ల దాడి జరిగిందంటూ ప్రచారం జరిగింది. 
పలువురు కానిస్టేబుళ్లకు, బీజేపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఎంపీ బండి సంజయ్ మీద రాళ్ల దాడి జరిగినట్లుగా వచ్చిన వార్తలను ఖండించారు కరీంనగర్ పోలీసులు. 
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రజల భద్రత కోసం ఎల్లవేళలా పనిచేస్తూ ఉన్నారని ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు, సందేశాలు స్ప్రెడ్ చెయ్యడం సరికాదని అన్నారు.
తన మీద దాడి జరిగినా కూడా ఎలాంటి దాడి జరగలేదంటూ పోలీస్ కమిషనర్ చెప్పడంతో హర్ట్ అయిన ఎంపీ బండి సంజయ్ తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని వెనక్కు పంపేశారు.