Ram Shankar Katheria: రాహుల్ గాంధీలాగే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోబోయి కాస్తంతలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ
2011 నవంబర్లో విద్యుత్ కంపెనీ ఉద్యోగులను కొట్టినందుకు ఆగ్రాకు మాజీ కేంద్ర మంత్రి కతేరియాకు కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది
- tony bekkal
- Published On : August 7, 2023 / 06:41 PM IST
Ram Shankar Katheria Jail Term: 2011లో జరిగిన దాడి కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితమే రెండేళ్ల శిక్ష పడిన భారతీయ జనతా పార్టీ నేత, ఇటావా ఎంపీ రాంశంకర్ కతేరియా.. రాహుల్ గాంధీలాగే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోబోయారు. అయితే ఆగ్రా కోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా స్టే వచ్చింది. శనివారం ఆగ్రా కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రా సెషన్స్ కోర్టులో ఆయన అప్పీలు చేశారు. ఈ నిర్ణయంపై కతేరియా మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఆగ్రాలోని ఆయన నివాసంలో స్వీట్లు పంచి కార్యకర్తలు కోలాహాలంగా గడిపారు.
ఈ అప్పీల్ పరిష్కారమయ్యే వరకు శిక్షపై స్టే విధిస్తున్నట్లు విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది. అనంతరం తన అప్పీల్పై బెయిల్ కూడా పొందారు. 2011 నవంబర్లో విద్యుత్ కంపెనీ ఉద్యోగులను కొట్టినందుకు ఆగ్రాకు మాజీ కేంద్ర మంత్రి కతేరియాకు కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది. భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 147 (అల్లర్లు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. మరోవైపు, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఎన్నికైన ప్రజాప్రతినిధి ఏదైనా నేరానికి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించిన వెంటనే అనర్హత వేటు వేయాలి. అందుకే అతని సభ్యత్వంపై కూడా ప్రశ్నలు తలెత్తగా, ఇప్పుడు కోర్టు రిలీఫ్ ఇచ్చింది.
బీజేపీ ఎంపీ రాంశంకర్ కతేరియా 1964 సెప్టెంబర్ 21న ఉత్తరప్రదేశ్లోని ఇటావాలోని నగరియా సరావా గ్రామంలో జన్మించారు. బీజేపీ నేత రామ్ శంకర్ కతేరియా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 2016 జూలై 6 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 సంవత్సరంలో ఎటావా లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
