Nitish Kumar: యూపీ నుంచి నితీశ్ జాతీయ పోరు.. అంబేద్కర్ నగర్ నుంచి పోటీ?
ఢిల్లీకి మార్గం యూపీనే అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీని గెలిస్తే ఢిల్లీకి చేరుకున్నట్లే అంటుంటారు. కేంద్రంలో అత్యధిక మెజారిటీతో రెండుసార్లు మోదీ ప్రభుత్వం ఏర్పడడానికి యూపీలో గెలిచిన స్థానాలే కీలకమయ్యాయి. ఆనాదిగా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాలు యూపీ నిర్ణయంపై ఆధారపడుతూ వస్తున్నాయి. చాలా తక్కువ సందర్భాల్లో మినహా.. దేశ రాజకీయాలకు యూపీ కీలకంగా ఉంటూ వస్తోంది. మరి నితీశ్ జాతీయ రాజకీయాలకు యూపీ ఏ విధమైన ఫలితాలనిస్తుందో చూడాలి.
- tony bekkal
- Published On : September 20, 2022 / 07:08 PM IST
Could Nitish Kumar too look at Uttar Pradesh in bid for national launch?
Nitish Kumar: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ పోరుకు వేదికగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు, యూపీ జనతాదళ్ యూనిట్ సైతం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో యూపీలోని అంబేద్కర్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారనే వార్తలు సైతం గుప్పుమంటున్నాయి.
సెప్టెంబర్ తొలి వారంలో గురుగ్రాంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సహా ప్రస్తుత ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను నితీశ్ కుమార్ కలుసుకున్నారు. ఈ సందర్భంలోనే యూపీలో కలిసి పోటే చేసే విషయమై చర్చ జరిగిందని, అందుకు ఎస్పీ సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నితీశ్, అఖిలేష్ కలయికలో యూపీలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. ‘యూపీ+బిహార్=గయీ బీజేపీ సర్కార్’ అంటూ ఆ బ్యానర్లలో రాసుకొచ్చారు.
బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చిన రాష్ట్రం యూపీ. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాష్ట్రంలోని వారణాసి లోక్సభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీని మోదీని గట్టిగా ఎదుర్కోవాలంటే యూపీ నుంచే ప్రధాన అడుగు వేయాలని అందులో భాగంగా యూపీ నుంచి పోటీ చేయాలని నితీశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తాజాగా యూపీ జేడీయూ అధ్యక్షుడు అనూప్ సింగ్ పటేల్ స్పందిస్తూ మిర్జాపూర్, ఫూల్పూర్, అంబేద్కర్ నగర్ నియోజకవర్గాల నుంచి నితీశ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ఈ నియోజకవర్గాల్లో ఓబీసీ ఓట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. నితీశ్ సామాజిక వర్గమైన కుర్మీలు ఈ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఉంటారు.
వాస్తవానికి ఢిల్లీకి మార్గం యూపీనే అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీని గెలిస్తే ఢిల్లీకి చేరుకున్నట్లే అంటుంటారు. కేంద్రంలో అత్యధిక మెజారిటీతో రెండుసార్లు మోదీ ప్రభుత్వం ఏర్పడడానికి యూపీలో గెలిచిన స్థానాలే కీలకమయ్యాయి. ఆనాదిగా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాలు యూపీ నిర్ణయంపై ఆధారపడుతూ వస్తున్నాయి. చాలా తక్కువ సందర్భాల్లో మినహా.. దేశ రాజకీయాలకు యూపీ కీలకంగా ఉంటూ వస్తోంది. మరి నితీశ్ జాతీయ రాజకీయాలకు యూపీ ఏ విధమైన ఫలితాలనిస్తుందో చూడాలి.
Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి రాహుల్ ఔట్.. దూరంగా ఉండాలని నిర్ణయం
