Women Reservation Bill: దేశంలోని కొత్త పార్లమెంట్ ఇప్పుడు మహిళా శక్తిని ఆవహించుకోనుంది. లోక్సభ, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే (128వ సవరణ) బిల్లు 2023కు నారీ శక్తి వందన్ చట్టం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టారు. ఈ బిల్లును మంగళవారం (సెప్టెంబర్ 19) లోక్సభలో ప్రవేశపెట్టారు. బీజేపీకి ఉన్న సంఖ్యా బలంతో బిల్లు లోక్సభలో ఆమోదం పొందడమే కాకుండా రాజ్యసభలో కూడా ఎలాంటి ఆటంకం ఉండదని అందరూ భావిస్తున్నారు. కాగా, ఈ బిల్లు ఎప్పుడు, ఎలా అమలు చేయబడుతుందనే ప్రశ్న ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తారా లేదా 2024 లోక్సభ ఎన్నికలలోగా అమలు చేస్తారా. లేదంటే దీని కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
దీనిని రాజ్యాంగం (128వ సవరణ) బిల్లు 2023 లేదా నారీ శక్తి వందన్ చట్టం లేదా మహిళా రిజర్వేషన్ బిల్లు అని పిలుస్తున్నారు. దీనిని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే ఏమి జరుగుతుంది? ఈ చట్టం వెంటనే అమలులోకి వస్తుందా? ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు వస్తాయా? ఈ చట్టం రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందా? అనేవి ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
అయితే వీటికి సమాధానం లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులోనే ఉంది. లోక్సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన బిల్లులో.. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. జనాభా గణన డేటా చేసిన అనంతరం డీలిమిటేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే రాజ్యాంగ సవరణ బిల్లు 2023 అమలుకు వస్తుంది. ఇది అమలు తేదీ నుంచి వచ్చే 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. అంటే ముందుగా దేశ జనాభా గణనను నిర్వహిస్తారు.
ఈ జనాభా గణన 2021లో నిర్వహించాల్సి ఉంది. అయితే అది ఇంతవరకూ జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు ఏమీ చెప్పలేము. జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ఉంటుంది. అంటే జనాభా పరంగా లోక్సభ నియోజకవర్గాన్ని పునర్నిర్మించి, అప్పుడే ఈ చట్టం అమలులోకి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఇది 2024 లో అమలు చేయబడదు. అయితే ఇది 2029లో అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. నిజానికి అది అమలు కావడం అంత సులభం కాదు. మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో చేసిన రాజ్యాంగ సవరణే ఇందుకు కారణం. 2026 తర్వాత తొలి జనాభా గణన నిర్వహించి దాని డేటాను విడుదల చేసి ఆ తర్వాత డీలిమిటేషన్ చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2026 తర్వాత తొలి జనాభా గణన 2031లో జరగనుంది. ఆ తర్వాత 2034లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే ఆ లోక్సభలో నారీ శక్తి వందన్ చట్టం అమలులోకి వస్తుంది.
ఈ చట్టాన్ని మధ్యలోనే అమలు చేయగలరేమో చూడాలి. మంత్రి మేఘవాల్ సమర్పించిన బిల్లులో ఈ ప్రభుత్వ హయాంలో అమలు కావడం లేదని స్పష్టంగా రాశారు. అందువల్ల, చట్టాన్ని అమలు చేయడానికి వచ్చే లోక్సభ పూర్తి కాలం వరకు వేచి ఉండవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 2029 ఎన్నికలకు ముందు లోక్సభలో ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడం సాధ్యం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చట్టం అమలు విషయానికొస్తే.. జనాభా గణన నిర్వహించని వరకు చట్టం అమలు చేయరాదనే నిబంధన బిల్లులోనే ఉంది.
మహిళలకు కల్పించే రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికే అటుఇటుగా మూడు దశాబ్దాలు కావస్తోంది. ఇక ఈ చట్టం పూర్తి స్థాయి అమలుకు ఐదేళ్లు పడుతుందో, పదేళ్లు పడుతుందో తెలియదు. మరి మహిళల చేతికి ప్రభుత్వ పగ్గాలు అనే మాట మరింత ప్రశ్నార్థకంగా ఉంది. రిజర్వేషన్లకే ఇంత కాలయాపన అయితే అధికారానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో అంటున్నారు.