Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత పదవి నుంచి వైదొలగిన ఫారూఖ్ అబ్దుల్లా
జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 1932లో ఏర్పడింది. కశ్మీర్ బలమైన నేత షేక్ అబ్దుల్లా, చౌదరి గులాం అబ్బాస్ ఈ పార్టీని స్థాపించారు. మొదట ఈ పార్టీ పేరు ఆల్ జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్. 1939లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీగా పేరు మార్చారు. 1941లో ఈ పార్టీ నుంచి అబ్బాస్ వైదొలగి స్వతంత్ర కశ్మీర్ పోరాటం చేశారు. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం 1947లో భారత్లో కలిసి ఉండడానికి మద్దతు ఇచ్చింది.
- tony bekkal
- Published On : November 18, 2022 / 02:55 PM IST
Former J&K CM Farooq Abdullah steps down as National Conference chief
Farooq Abdullah: జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్(జేకేఎన్సీ) పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా వైదొలగారు. శుక్రవారం జేకేఎన్సీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తల ముందు ఈ ప్రకటన చేశారు. కాగా, పార్టీకి తదుపరి అధినేతను డిసెంబర్ 5న ఎన్నిక జరుగుతుందని ఆయన ప్రకటించారు. అయితే, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒమర్ అబ్దుల్లానే పార్టీ అధ్యక్షుడవుతారనే అంచనాలు బలంగా ఉన్నాయి.
పార్టీ సమావేశంలో ఫారూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ ‘‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో నేను పార్టీని నడిపించడం కష్టమవుతోంది. పార్టీలో ఉన్న ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. ప్రజాస్వామికంగా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది’’ అని అన్నారు. 1981లో మొదటిసారి జేకేఎన్సీ పార్టీ అధ్యక్షుడిగా ఫారూఖ్ ఎన్నికయ్యారు.
జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 1932లో ఏర్పడింది. కశ్మీర్ బలమైన నేత షేక్ అబ్దుల్లా, చౌదరి గులాం అబ్బాస్ ఈ పార్టీని స్థాపించారు. మొదట ఈ పార్టీ పేరు ఆల్ జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్. 1939లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీగా పేరు మార్చారు. 1941లో ఈ పార్టీ నుంచి అబ్బాస్ వైదొలగి స్వతంత్ర కశ్మీర్ పోరాటం చేశారు. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం 1947లో భారత్లో కలిసి ఉండడానికి మద్దతు ఇచ్చింది.
జమ్మూ కశ్మీర్ను సుదీర్ఘ కాలం పాటు ఈ పార్టీ పాలించింది. 1947లో మొదట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2002 వరకు నిరాటకంగా పాలించింది. మళ్లీ 2009 నుంచి 2015 వరకు పాలించింది. ఇక షేక్ అబ్దుల్లా కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఫారూఖ్ అబ్దుల్లా.. ఈ పార్టీకి నాయకత్వం వహించి 1982లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం పలుమార్లు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా పని చేశారు.
