Former Punjab CM Captain Amarinder Singh joined BJP
Punjab: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయంగా కొత్త అధ్యాయం ప్రారంభించారు. సోమవారం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజుజు ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కిరణ్ రిజుజు మాట్లాడుతూ కెప్టెన్ హయాంలో జాతీయ భద్రత కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేశారని కిరణ్ రిజుజు కితాబునిచ్చారు. మంచి మనసున్న వారంతా ఒక జట్టు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. చేరిక అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కెప్టెన్ సమావేశమయ్యారు. 2024లో పంజాబ్లో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే బాధ్యతను కెప్టెన్కు అప్పగించనున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు అమరీందర్ను పార్టీ నుంచి తొలగించారు. అనంతరం ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగారు. అయితే ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేనా తనకు బాగా పట్టున్న నియోజకవర్గం పటియాలాలో ఆయన ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ తనను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వేరుకుంపటి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో సరిగా ప్రచారం కూడా చేయలేకపోయారు.