ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. దీంతో పాటు జేసీ ట్రావెల్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామని చెప్పారు. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని ఆయన గుర్తు చేశారు.
దీని ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని కానీ దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. వీటిని స్క్రాబ్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు వివరాలు పంపిందని వెల్లడించారు. నాగాలాండ్లో బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చారని… ఇందులో 6 వాహనాలు జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయని ప్రసాదరావు తెలిపారు.
ఇందులో ఒక వాహనం జేసీ ట్రావెల్స్ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టర్ అయ్యిందని పేర్కొన్నారు. మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. దీనిపై వన్టౌన్ పోలీస్ స్టేషన్ లో జేసీపై ఫిర్యాదు అందిందని చెప్పారు. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు జేసీ ట్రావెల్స్ అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.