‘ఏపీ దేవాదాయ శాఖ- 2020 క్యాలెండర్’ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 ముఖ్య దేవాలయాలను క్యాలెండర్ లో ముద్రించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాదాయ శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దేవాలయాల భూములు పరిరక్షణకు చర్యలు చేపట్టామని చెప్పారు.
అన్యమత ప్రచారమంటూ కొన్ని పార్టీలు ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. టీటీడీలో అన్యమత ప్రచారం పై శాసనమండలిలో లోకేష్కు సవాల్ విసిరితే..ఆయన పారిపోయారని ఎద్దేవా చేశారు. గూగుల్లో జరిగే తప్పులను ప్రభుత్వంపై నెడుతున్నారని నిప్పులు చెరిగారు.
వైసీపీ ప్రభుత్వం ఏకులానికో, మతానికో చెందినది కాదని, పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.