ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లోఏర్పాటు చేసేందుకు అభ్యంతరం చెప్పామని వస్తున్న వార్తలను నేవీ అధికారులు ఖండించారు. మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, దీనిపై అభ్యంతరాలు కూడా చెప్పలేదని స్పష్టం చేసింది.
విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేందుకు నేవి అభ్యంతరాలు చెప్పిందని టీడీపీ ఆరోపిించింది. ఒకవేళ విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మొత్తం జనాలతో నిండిపోతుంది. దీని వలన దేశరక్షణకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయని భద్రత కొరవడుతుంది అని అందుకే నేవి పరిపాలన రాజధానిగా అభ్యంతరాలు తెలిపిందని టీడీపీ నేత బోండా ఉమా పేర్కొన్నారు.
విశాఖపట్నంలో రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ బోండా ఉమ ఆరోపించారు. దేశ రక్షణకు సంబంధించిన అనేక కార్యాలయాలు, నేవికి సంబంధించిన పరిశోధన సంస్థలతో పాటు ఐఏఎస్ కళింగ, జలాంతర్గాముల తయారీ కేంద్రాలు అన్ని విశాఖలోనే ఉన్నాయని.. దీంతో విశాఖ రాజధానిగా సురక్షితం కాదని నేవీ అధికారులు అంటునట్లు టీడీపీ వాదించింది.
దీనికి సంబంధించిన వార్త ఒకటి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విశాఖ రాజధానిగా మారుతుందా లేదా అన్న చర్చ మరోవైపు ఏపీలో కొనసాగుతోంది. సీఎం జగన్ ఏ క్షణంలో అయినా అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖలోని మిలీనియం టవర్స్ కు తరలించే ఆలోచనలో ఉన్నారని సీఎం తాజా నిర్ణయాలతో తెలుస్తుంది. ఇదిలా ఉంటే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను నేవీ అధికారులు ఖండించారు.