Parliament updates: పార్లమెంటులో ఇవాళ కూడా గందరగోళం నెలకొంది. అదానీ గ్రూప్ వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చకు విపక్ష పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పే తీర్మానంపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీని ”మౌనీ బాబా” అన్నారు. అదానీ వ్యవహారంపై మోదీ మౌనం వహిస్తున్నందుకు ఈ వ్యాఖ్య చేశారు.
”ప్రధాని మోదీని నేను ఓ విషయం అడగాలనుకుంటున్నాను. మీరు ఇంత మౌనంగా ఎందుకు ఉన్నారు? మీరు అందరినీ భయపెట్టి పక్కకు తప్పుకునేలా చేస్తారు. మరి పారిశ్రామికవేత్తలను ఎందుకు భయపెట్టడం లేదు? ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై ప్రధాని కన్నెత్తి చూస్తే వారు ఆ ప్రయత్నాలను మానుకుంటారు. కానీ, ఇప్పుడు ప్రధాని మౌనంగా ఉంటున్నారు. ఆయన ఇప్పుడు మౌనీ బాబా అయిపోయారు” అని మల్లికార్జున ఖర్గే చెప్పారు.
అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ అవసరమని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ధనాన్ని అదానీ గ్రూప్ వంటి ప్రైవేటు సంస్థల్లో పెడుతోందని ఆరోపించారు. మోదీని మౌనీ బాబా అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్ కర్ మండిపడ్డారు.
ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఖర్గే స్థాయికి సరికాదని చెప్పారు. నిబంధనల ప్రకారమూ అటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. సభలో ఖర్గే చర్చ స్థాయిని పెంచుతారని ఆశించానని, అది జరగలేదని వ్యాఖ్యానించారు.