Bihar Politics: ఇండియా కూటమి చీలిపోతుందా? సీఎం నితీశ్ కుమార్కు తేజశ్వీ యాదవ్ ఇచ్చిన సలహా ఏంటి?
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతికి హాజరైన సందర్భంగా, ఇది రాష్ట్ర కార్యక్రమమని అన్నారు. ఇందులో ప్రొటోకాల్ ప్రకారం వెళ్లాలని, తాము ఎవరినీ వ్యక్తిగతంగా వ్యతిరేకించనప్పటికీ, సైద్ధాంతిక వ్యతిరేకత వేరే విషయమని చెప్పారు
- tony bekkal
- Published On : September 25, 2023 / 08:41 PM IST
INDIA bloc: కాంగ్రెస్ సహా మిత్ర పార్టీలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ గుర్రుగా ఉన్నారు. మహా కూటమి (ఇండియా కూటమి)ని తాను ఏర్పాటు చేస్తే తనను లెక్కే చేయడం లేదు. దీంతో ఆయన పార్టీ కూటమి నుంచి బయటికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన బయటికి వస్తే బిహార్ కు చెందిన మరో పార్టీ ఆర్జేడీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం గురించి తేజశ్వీ యాదవ్ ను ప్రశ్నించగా ఇదంతా భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పుప్రచారమని కొట్టిపారేశారు.
సోమవారం పాట్నా విమానాశ్రయానికి చేరుకున్న తేజశ్వీ యాదవ్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం ఒక్కటయ్యాం. మొట్టమొదట బీహార్లో నితీష్ కుమార్, లాలూ యాదవ్ అందరూ ఒక్కటయ్యారు. బీహార్లో మహా కూటమి ఏర్పడింది. ఇది దేశవ్యాప్తంగా జరగాలని నిర్ణయించుకున్నాం. మా ప్రయత్నం సఫలమైంది. సమావేశాలు జరగడం చాలా మంచిది’’ అని అన్నారు. అదే సమయంలో, నితీశ్ కుమార్కు సంబంధించిన ఊహాగానాలపై తేజస్వి స్పందిస్తూ.. ఈ విషయమై తాను నితీశ్ తో మాట్లాడానని, దీనిపై ఇప్పటికే బహిరంగ ప్రకటన కూడా చేశానని గుర్తు చేశారు. నితీశ్ కుమార్ ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తేజశ్వీ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసి దేశంలో బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని గత ఏడాది ప్రతిజ్ఞ చేశామని తేజస్వీ యాదవ్ అన్నారు. తాము ఈ పనిలో నిమగ్నమై ఉన్నామని తాజాగా స్పష్టం చేశారు. అదే సమయంలో, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతికి హాజరైన సందర్భంగా, ఇది రాష్ట్ర కార్యక్రమమని అన్నారు. ఇందులో ప్రొటోకాల్ ప్రకారం వెళ్లాలని, తాము ఎవరినీ వ్యక్తిగతంగా వ్యతిరేకించనప్పటికీ, సైద్ధాంతిక వ్యతిరేకత వేరే విషయమని చెప్పారు. గాంధీజీని వ్యతిరేకించే వారు కూడా ఆయనకు పూలమాలలు సమర్పిస్తారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి తేజశ్వీ అన్నారు.
