టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు

టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.

  • Publish Date - January 12, 2020 / 01:33 AM IST

టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.

టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు. పెద్ద నేతలు తమకు నచ్చినవారికే టికెట్లు ఇచ్చుకున్నారని మరో వర్గం వాళ్లు గొడవ పెట్టుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. నేతలు వినే పరిస్థితి కనిపించడం లేదు.

తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ.. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. కాని, ఎంపీ స్థానాలు గెలిచిన జిల్లాల్లో కొత్త రచ్చ మొదలైంది. ముఖ్యంగా కరీంనగర్‌, నిజమాబాద్‌ జిల్లాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. కాకపోతే, ఈ రెండు జిల్లాల్లోనే రగడ మొదలైంది. మంత్రి గంగుల కమలాకర్‌తో ఉన్న విభేదాల కారణంగా కరీంనగర్ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఎంపీ బండి సంజయ్‌తో ఓ హోటల్‌లో సమావేశ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రవీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరితే.. మరోసారి మేయర్‌ ఛాన్స్‌ ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కరీంనగర్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లుండగా.. కొత్తగా ఎవరికో అవకాశం ఇవ్వడమేంటన్న గొడవ మొదలైంది. 

ఇక నిజామాబాద్‌లో అయితే టికెట్లు అమ్ముకున్నారంటూ ఆశావహులు ఆందోళనకు దిగారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏకంగా పెద్ద గందరగోళమే నడిచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఆశావహులు అడ్డుకున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లు కేటాయించారంటూ ఎంపీ అర్వింద్‌పై ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ సర్దిచెప్పినా నేతలు వినిపించుకోకపోవడంతో… పరిస్థితి గందరగోళంగా మారింది. 

అసలే బీజేపీకి అభ్యర్థులు లేరు. మొత్తం 2727 వార్డులకు దాదాపు 30 శాతం స్థానాల్లో అసలు నామినేషన్లే వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. పైగా నామినేషన్ల గడువు కూడా ముగిసింది. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన కిషన్ రెడ్డి.. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై ముందు నుంచే బీజేపీ కసరత్తు చేసినప్పటికీ.. ఇలాంటి పరిస్థితి రావడంపై అసహనం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లోనూ బీజేపీ తరపున పలు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంపై క్లస్టర్ ఇంఛార్జ్‌లను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదిలోనే ఇబ్బందికర పరిస్థితి ఎదురైనట్టు కనిపిస్తోంది.

Also Read : హతవిధి : టి.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరవు