ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ తాను సీఎంను కలిస్తే చంద్రబాబుకు ఉలుకెందుకు అని ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ తాను సీఎంను కలిస్తే చంద్రబాబుకు ఉలుకెందుకు అని ప్రశ్నించారు. తాను సీఎంను కలవడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో పోలవరం కాలువ భూ సేకరణ సమస్యపై సీఎంతో మాట్లాడనని తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న బాబుకు భయమెందుకని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తనను బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పప్పు బ్యాచ్ తనను టార్గెట్ చేసిందన్నారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియదన్నారు. టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేశామన్నారని తెలిపారు. టీడీపీలో తాను కొనసాగలేనన్నారు. తనను ప్రత్యేక సభ్యుడి కింద గుర్తించి..తన హక్కులను కాపాడాలని స్పీకర్ కు రిక్వెస్ట్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు ఎంతో మంచివి అన్నారు. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వంశీ అభినందించారు.
టీడీపీ నేతలు వంశీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ కూడా ఓ ప్రజాప్రతినిధి అన్నారు. ప్రజా సమస్యలపై తన అభిప్రాయం చెప్పుకునే ఒకే ఒక వేదిక అసెంబ్లీ అన్నారు. సభలో సభ్యుడి గొంతునొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోనని స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయం చెప్పుకోనివ్వండన్నారు.
వంశీ మాట్లాడితే మీకు వచ్చే సమస్య ఏంటని ప్రశ్నించారు. ఆయనకు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. గౌరవ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం శాసనసభలో చేస్తే ..దాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించనని అన్నారు. ప్రజలు తమను అసహ్యించుకుంటే వారే తీర్పు చెబుతారని అన్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.