Congress President Election: ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టడానికి ఎంత మాత్రం సముఖంగా లేని రాహుల్ గాంధీ.. తాజా పోటీలో పాల్గొనబోనని తేల్చి చెప్పడంతో ఆ పదవికి పోటీ పెరుగుతోంది. ఇప్పటికే రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ పోటీలో ఉండగా.. ఆయనకు పోటీ దారుగా శశి థరూర్ నిలబడనున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైత పోటీకి దిగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఏఐసీసీ పదవికి పోటీ చేయబోతున్నట్లు బుధవారం ఆయనే స్వయంగా ప్రకటించారు.
ఇక ఇదే రాష్ట్రానికి చెందిన మరో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సైతం ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మనీశ్ తివారి, ముకుల్ వాస్నిక్, పృథ్విరాజ్ చౌహాన్లు సైతం పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు గెహ్లోత్, థరూర్ మధ్యే అనుకున్న ఈ పోటీ.. ఎన్నిక సమయం దగ్గర పడుతున్నాకొద్ది అభ్యర్థులు పెరగడంతో మరింత తీవ్రమవుతోంది.
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా జరిగిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు. అనంతరం అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి.
Sachin Pilot: రాజస్తాన్ సీఎంగా సచిన్ పైలట్.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్!