IND vs WI : అదరగొట్టిన అశ్విన్.. ఆ విషయంలో మనం తప్పు చేశామా..?.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అదరగొడుతున్నాడు. మొదటి రోజు ఆటలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 13, 2023 / 03:20 PM IST
Ravichandran Ashwin
IND vs WI 1ST Test : వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అదరగొడుతున్నాడు. మొదటి రోజు ఆటలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. ఓపెనర్లు టగ్నరైన్ చంద్ర పాల్(12), బ్రాత్ వైట్(20)లతో పాటు అరంగ్రేటం బ్యాటర్ అలిక్ అథనాజ్(47), అల్జారీ జోసెఫ్(4), వారికన్(1)లను పెవిలియన్కు చేర్చాడు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
లండన్లోని ఓవల్ వేదికగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్ మ్యాచ్లో టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ బౌలర్గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్కు తుది జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో టీమ్ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. అశ్విన్ తుది జట్టులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడిన సంగతి తెలిసిందే.
అశ్విన్ తాజా ప్రదర్శనను ఉద్దేశించి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు తనను దూరంగా ఉంచడం ద్వారా మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పుచేసిందో గ్రహించేలా చేశాడని అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా మాట్లాడుతూ.. “టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకు కుప్పకూలింది. సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో అశ్విన్ను ఆడించకుండా మనం పెద్ద తప్పు చేశామా అనే ఫీలింగ్ కలిగేలా చేశాడు.” అని అన్నాడు.
సాధారణంగా విండీస్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటాయన్నాడు. ఈ సిరీస్లో అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలుస్తాడని తాను ముందుగానే అంచనా వేశానని చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే.. మొదటి రోజు చేసిన ప్రదర్శననే మిగతా రోజుల్లోనూ చేస్తేనే అది సాధ్యమన్నాడు.
WI vs IND : వెస్టిండీస్పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో తెలుసా..?
