Arshdeep Singh : నాలుగు వికెట్లు తీస్తే చాలు.. అర్ష్దీప్ సింగ్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. అశ్విన్ను అధిగమించినట్లే..
India vs Namibia : నమీబియాతో జరిగే మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొడితే భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ పేరున అరుదైన రికార్డు నమోదు కానుంది.
- Harishth Thanniru
- Published On : February 12, 2026 / 12:59 PM IST
Arshdeep Singh
- నేడు ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్
- అరుదైన రికార్డుకు నాలుగు వికెట్ల దూరంలో అర్ష్దీప్ సింగ్
- టీ20 ప్రపంచకప్ మ్యాచులలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచే చాన్స్
Arshdeep Singh : టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం రాత్రి ఇండియా వర్సెస్ నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొడితే భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ పేరున అరుదైన రికార్డు నమోదు కానుంది.
Also Read : India vs Namibia : నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..! ఓపెనర్గా ఊహించని పేరు..
అర్ష్దీప్ సింగ్ 2022 జులై నెలలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 ఫార్మాట్లో అరంగ్రేటం చేశాడు. టీ20 ఫార్మాట్లో ఒక ఎడిషన్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్గా అర్ష్దీప్ సింగ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే, ఇవాళ నమీబియా జట్టుతో జరిగే మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొడితే టీ20 ప్రపంచకప్ మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలుస్తాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేరుతో ప్రస్తుతం ఈ రికార్డు నమోదై ఉంది. అశ్విన్ తన కెరీర్లో 24 టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు ఆడి 32 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అర్ష్దీప్ సింగ్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. అతడు కేవలం 15 మ్యాచ్లలోనే 29 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే అశ్విన్ రికార్డును అధిగమించి టీ20 ప్రపంచకప్ మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అర్ష్దీప్ సింగ్ నిలవనున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా టీ20 వరల్డ్కప్ మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసుకున్న రికార్డు బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పేరిట ఉంది. అతను 43 మ్యాచ్ లలో 50 వికెట్లు పడగొట్టాడు. భారత్ లో అశ్విన్, అర్ష్దీప్ సింగ్ తరువాత స్థానాల్లో జస్ర్పీత్ బుమ్రా (18 మ్యాచ్ లు 26 వికెట్లు), హార్దిక్ పాండ్య (25 మ్యాచ్ లు 24 వికెట్లు), రవీంద్ర జడేజా (30 మ్యాచ్ లు 22 వికెట్లు) ఉన్నారు.
