Ashwin Wife Prithi Narrates Rajkot Test Emergency
Ashwin Wife Prithi : భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయి ముంగిట ఉన్నాడు. 100వ టెస్టు ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ధర్మశాల వేదికగా గురువారం ఇంగ్లాండ్తో ఆరంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్ అశ్విన్ కెరీర్లో వందో టెస్ట్ కావడం విశేషం. కాగా.. ఈ సిరీస్లోనే అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. రాజ్కోట్ టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆటలో దీన్ని అందుకున్నాడు. ఇక అదే రోజు ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అతడు చెన్నైకి వెళ్లినట్లు బీసీసీఐ తెలిపింది.
అశ్విన్ తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతోనే అతడు వెళ్లాల్సి వచ్చిందని ఆ తరువాత తెలిసింది. అశ్విన్ ఈ విషయం పై ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. అయితే.. అశ్విన్ వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో అతడి భార్య ప్రతీ నారాయణన్ ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించింది. అశ్విన్ తల్లి అకస్మాత్తుగా కుప్పకూలిపోయిందని చెప్పింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపింది. అయితే.. ఈ విషయాన్ని అశ్విన్కు చెప్పేకంటే ముందు టీమ్ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర పుజారా ఫోన్ చేసినట్లు వెల్లడించింది. అశ్విన్ వచ్చే మార్గాన్ని సూచించాలని అతడి కోరింది.
‘ఆ రోజు (రాజ్కోట్ టెస్ట్ రెండో రోజు) పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చారు. ఐదు నిమిషాల తర్వాత అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. మేము అందరం ఫోన్కు వస్తున్న అభినందన సందేశాలకు సమాధానం ఇస్తున్నాము. సరిగ్గా అదే సమయంలో ఆంటీ కుప్పకూలిపోయింది. ఓ అరుపు వినిపించింది. ఆ సమయంలో రాజ్కోట్-చెన్నై కి మధ్య విమాన కనెక్టివిటీ సరిగా లేనందున అశ్విన్కి ఈ విషయం చెప్పకూడదని అనుకున్నాము. ‘అని ప్రీతీ అంది.
‘కాబట్టి మేము వెంటనే ఛతేశ్వర పుజారాకు ఫోన్ చేశాము. అతడి కుటుంబ సభ్యులు ఎంతో సాయం చేశారు. మేము ఓ మార్గాన్ని కనుగొన్న తరువాత అశ్విన్కు కాల్ చేశాము. ఎందుకంటే ఈ సమయంలో అశ్విన్ తన తల్లి దగ్గర ఉంటే మంచిది అని స్కానింగ్ తరువాత వైద్యులు చెప్పారు. విషయాన్ని అశ్విన్కు ఫోన్లో చెప్పగానే అతడు ఎంతో బాధపడ్డాడు. మళ్లీ మాకు ఫోన్ చేసేందుకు 20-25 నిమిషాల సమయం పట్టింది. అర్ధరాత్రి ఇక్కడకు చేరుకున్నాడు. అతడు ఇక్కడకు చేరుకునేందుకు సహకరించిన రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, జట్టులోని ఇతర ఆటగాళ్లు, బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’ అని ప్రీతీ తెలిపింది.
Rohit Sharma : ఐదో టెస్టుకు ముందు కెప్టెన్ రోహిత్శర్మను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
అదృష్టవశాత్తూ అశ్విన్ తల్లి కోలుకుంది. దీంతో అతడు రాజ్కోట్కి తిరుగు వెళ్లి మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో పాల్గొన్నాడు అని నాటి ఘటనను ప్రీతీ వివరించింది.