IND w vs AUS w
IND w Vs AUS w : ఆసీస్ గడ్డపై భారత మహిళా జట్టు అదరగొట్టింది. తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళా జట్టును ఓడించింది. భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం తొలి టీ20 మ్యాచ్ సిడ్నీ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో డక్వర్త్లూయిస్ పద్ధతిన 21 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది.
Also Read : IND W vs AUS W : విజృంభించిన బౌలర్లు.. కుప్పకూలిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం
తొలుత ఆస్ట్రేలియా మహిళా జట్టు బ్యాటింగ్ చేసింది. భారత మహిళా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేయడంతో ఆసీస్ 18ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ గా నిలవగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
స్వల్ప లక్ష్య ఛేదనకోసం భారత మహిళా జట్టు బరిలోకి దిగా.. 5.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (21) ఔట్ కాగా.. స్మృతి మంధాన (16), జెమీమా రోడ్రిగ్స్ (9) క్రీజులో ఉన్నారు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో ఫలితాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో అంపైర్లు ప్రకటించారు. వర్షం వచ్చే సమయానికి భారత్ అదనంగా 21 పరుగులు చేసి ఉండటంతో భారత జట్టును విజేతగా ప్రకటించారు.