T20 World Cup
T20 World Cup : వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవటం దాదాపు ఖాయమైంది. భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్ -2026లో ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది. మెగా టోర్నీకి మరో 15రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో టోర్నీలో బంగ్లా భవితవ్యంపై ఐసీసీ శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే?
భారత్ – బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ తమ ప్లేయర్లను భారత్ కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత దేశంలో బంగ్లాదేశ్ జట్టు ఆడే మ్యాచ్ వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి ఆ దేశ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. అయితే, భారత్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదని, భద్రతాపరమైన ఎలాంటి ఇబ్బందులు భారత్ లో లేవని… మ్యాచ్ వేదికలను మార్చడం కుదరదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది. అదేక్రమంలో.. మరో 24గంటల సమయం ఇస్తున్నాం.. భారత్ లో ఆడకూడదన్న తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే టీ20 ప్రపంచ కప్ లో మరో జట్టుకు అవకాశం కల్పిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. దీంతో ఐసీసీ డెడ్లైన్పై బంగ్లాదేశ్ స్పందించింది. గురువారం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ.. భద్రతా కారణాల దృష్ట్యా భారత్కు తమ జట్టును పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే, బంగ్లాదేశ్ నిర్ణయంపై ఐసీసీ శుక్రవారం లేదా శనివారం నిర్ణయం తీసుకోనుంది. బంగ్లాదేశ్ విజ్ఞప్తికి ఐసీసీ సానుకూలంగా స్పందిస్తుందా.. లేదంటే ఆ జట్టును తప్పించి వేరే జట్టుకు టీ20 వరల్డ్ కప్లో అవకాశం కల్పిస్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
స్కాట్లాండ్ జట్టుకే చాన్స్ ఎందుకు..
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవటం దాదాపు ఖాయం కావడంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం దక్కనుంది. యూరోపియన్ క్వాలిఫయర్స్లో ఇటలీ, నెదర్లాండ్స్ జెర్సీ వెనుక నిలిచి స్కాట్లాండ్ అర్హత సాధించలేకపోయినప్పటికీ, టోర్నమెంట్కు అర్హత పొందని జట్లలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అత్యున్నత స్థానంలో ఉంది. అందువల్ల చివరి నిమిషంలో మార్పు అవసరమైతే స్కాట్లాండ్ సరైన ప్రత్యామ్నాయంగా ఐసీసీ భావిస్తోంది.
గతంలోనూ ఇలా..
భద్రత కారణాలతో ఐసీసీ టోర్నీకి దూరం కావాలని ఓ జట్టు నిర్ణయం తీసుకోవడం ఇది కొత్తేమీ కాదు. 1996 వన్డే ప్రపంచ కప్ కోసం శ్రీలంకలో ఆడేందుకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నిరాకరించాయి. 2023 వన్డే ప్రపంచకప్ లో జింబాబ్వేకు ఇంగ్లాండ్, కెన్వాకు న్యూజిలాండ్ వెళ్లలేదు. ప్రపభుత్వ నిర్ణయం మేరకు ఇంగ్లాండ్, భద్రత కారణాలతో కివీస్ ఆయా దేశాల్లో పర్యటించలేదు. 2009లో ఇంగ్లాండ్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి జింబాబ్వే వైదిలిగింది. భద్రత కారణాలతో బంగ్లాదేశ్ లో జరిగిన 2016 అండర్-19 ప్రపంచ కప్ లో ఆసీస్ ఆడలేదు. తాజాగా.. 2025 చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కు వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. అయితే, హైబ్రిడ్ పద్దతిలో దుబాయ్ వేదికగా భారత్ క్రికెట్ జట్టు మ్యాచ్ లు ఆడింది.