BCCI announces cash reward for ICC Mens T20 World Cup winning Team India
BCCI : టీ20 ప్రపంచకప్2026 విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచినప్పుడు రూ. 125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో పోలిస్తే అదనంగా రూ. 6 కోట్లు సూర్యకుమార్ సారథ్యంలోని జట్టుకు అందనుంది.
‘ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్2026లో విజేతగా నిలిచినందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియాకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ కప్పును నిలబెట్టుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండో సారి ప్రపంచకప్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక మొత్తంగా మూడు సార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో అత్యధిక సార్లు పొట్టి ప్రపంచకప్ను సాధించి తొలి జట్టుగా ఘనత సాధించింది. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
ఈ చారిత్రాత్మక విజయానికి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లను బోర్డు మరోసారి అభినందిస్తుంది. భవిష్యత్తులో వారు విజయం సాధించాలని కోరుకుంటోంది.’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు.
🚨 News 🚨
BCCI announces a cash reward of INR 131 crore for #TeamIndia following their triumphant campaign in the ICC Men’s T20 World Cup 2026.
🔽 Details | #T20WorldCup | #MenInBlue https://t.co/eagTz1eOUb
— BCCI (@BCCI) March 10, 2026
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలవడంతో సూర్యకుమార్ యాదవ్ సేన ఐసీసీ నుంచి ప్రైజ్మనీగా 27.48 కోట్లను సొంతం చేసుకుంది.