India Squad For Sri Lanka: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కీలక మార్పులు ఏమిటంటే?
స్వదేశంలో శ్రీలంకతో భారత్ టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. హార్ధిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించింది. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు హార్ధిక్ కు అప్పగించిన బీసీసీఐ.. వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. పరుగులు రాబట్టడంతో వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్కు రెండు ఫార్మాట్లలోనూ అవకాశం దక్కలేదు.
- Harishth Thanniru
- Published On : December 28, 2022 / 07:22 AM IST
Team India
India Squad for Sri Lanka: శ్రీలంక జట్టుతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్లకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించగా.. హార్ధిక్ సారథ్యం వహించనున్నారు. వన్డే సిరీస్కు రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. జట్టు ప్రకటనలో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. వన్డే జట్టులో కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. హార్ధిక్ పాండ్యాకు అవకాశం కల్పించింది. రిషబ్ పంత్కు రెండు ఫార్మాట్లలోనూ అవకాశం లభించలేదు. మరోవైపు టీ20 జట్టులో సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
శ్రీలంక జట్టుతో తలపడే టీమిండియా వన్డే జట్టు ..
టీ20 సిరీస్ లో కేఎల్ రాహుల్ కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ వన్డే సిరీస్ లో అవకాశం కల్పించింది. రాహుల్ పేలువమైన ప్రదర్శనతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నాయకత్వ బాధ్యతల్లోనూ రాహుల్ విఫలమైనట్లే చెప్పాలి. దీంతో రాహుల్కు వన్డే వైస్కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. అయితే, టీ20ల్లో మాత్రం అతని విజ్ఞప్తి మేరకు పక్కకుపెట్టినట్లు తెలుస్తోంది. టీ20 సిరీస్ జరిగే సమయంలో రాహుల్ పెళ్లి జరుగుతుందని సమాచారం. ఇదిలాఉంటే శిఖర్ ధావన్కు బీసీసీఐ షాకిచ్చింది. బంగ్లాతో వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శిఖర ధావన్ కు ప్రస్తుతం జట్టులో స్థానంసైతం లభించలేదు. బంగ్లాతో సిరీస్లో ధావన్ కెప్టెన్గా విఫలమయ్యాడు. బ్యాటర్ గానూ పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకే బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టినట్లు సమాచారం. అయితే, వయస్సురిత్యా రానున్న టీ20, వన్డేల్లోనూ ధావన్కు అవకాశం లభించకపోవచ్చని, ఇక ఆయన కెరీర్ దాదాపు ముగిసినట్లేనని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
శ్రీలంక జట్టుతో తలపడే టీమిండియా టీ20 జట్టు ..
గాయం నుంచి కోలుకోలేకపోవడంతో బూమ్రా పేరును ఈ సిరీస్ లకు బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్కు బీసీసీఐ షాకిచ్చింది. రెండు ఫార్మాట్లలోనూ పంత్కు అవకాశం కల్పించలేదు. ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ వన్డే జట్టుకు మాత్రమే ఎంపికయ్యాడు. శుభ్మన్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. రాహుల్ త్రిపాఠికి మరో అవకాశం దక్కింది. పేసర్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్లకు తొలిసారి టీ20 జట్టులో అవకాశం లభించింది. శ్రీలంక వర్సెస్ టీమిండియా జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరగనుండగా, జనవరి 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరుగుతాయి.
