IND vs SA : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
India vs South Africa : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగలనుంది.
- Thota Vamshi Kumar
- Published On : December 14, 2023 / 08:30 PM IST
Team India
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగలనుంది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్కు దూరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. షమీ చీలమండల గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. కాగా.. అతడు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని క్రిక్బజ్ నివేదిక పేర్కొంది.
దక్షిణాప్రికాతో రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భారత ఆటగాళ్లు శుక్రవారం దక్షిణాఫ్రికా వెళ్లే విమానం ఎక్కనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణాలు శుక్రవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నారు. వీరితో షమీ వెళ్లటం లేదు.
కాగా.. వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో షమీకి చోటు దక్కలేదు. ఆల్రౌండర్ హర్దిక్ పాండ్య గాయపడడంతో షమీకి తుది జట్టులో చోటు దక్కింది. తనకు వచ్చిన అవకాశాన్ని షమీ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు.
టీమ్ఇండియాకు ఎంతో ముఖ్యం..
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)2023-25 లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొందడం భారత్కు చాలా ముఖ్యం. అయితే.. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు ఇంత వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సారి అయిన అందని ద్రాక్షగా ఉన్న సిరీస్ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో సూపర్ ఫామ్లో ఉన్న షమీ సిరీస్కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. మొదటి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్టౌన్ వేదికగా జరగనుంది.
