Big Blow To India Report Claims Shreyas Iyer To Miss Last 3 Tests Against England
IND vs ENG 3rd Test : ఇంగ్లాండ్తో మూడో టెస్టు మ్యాచ్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం బారిన పడ్డాడు. అతడి వెన్నుగాయం తిరగబెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచులకు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (ఎన్సీఏ)లో చేరనున్నట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో పేర్కొంది.
విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్ల లగేజ్లను మూడో టెస్టు మ్యాచ్ జరిగే రాజ్కోట్కు పంపించారు. అయితే.. శ్రేయస్ అయ్యర్ లగేజ్ను మాత్రం ముంబైకి పంపించినట్లుగా సమాచారం. అయ్యర్ మళ్లీ ఐపీఎల్ ద్వారానే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనంలో పేర్కింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో అయ్యర్ దారుణంగా విఫలం అయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్లు ఆడిన అతడు 26 సగటుతో 104 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే అయ్యర్ గాయంతో జట్టుకు దూరం అవ్వడం గమనార్హం.
‘సాధారణంగా 30 బాల్స్ కంటే ఎక్కువగా ఆడిన సందర్భాల్లో వెన్ను నొప్పి వస్తుందని, ఫార్వార్డ్ డిఫెన్స్ ఆడుతున్న సమయంలో గజ్జల్లో నొప్పి వస్తుందని అయ్యర్ మేనేజ్మెంట్, వైద్య సిబ్బందికి చెప్పాడట. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న అతడికి తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో అతడికి కొన్ని వారాలు విశ్రాంతి ఇవ్వాలని భావించారు.’ అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.
కోహ్లీ రాకపై లేని స్పష్టత..
మరోవైపు వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టులకు దూరం అయిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడు అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరం అయిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు మూడో టెస్టుకు అందుబాటులో ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో అయ్యర్ కూడా దూరం కావడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
ప్రస్తుత జట్టులో బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ తరువాత ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాడు శ్రేయసే కావడం గమనార్హం. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ జట్టులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన మూడు టెస్టు మ్యాచ్లకు ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.