Gede Priandana becomes first to pick five wickets in an over in T20Is
Gede Priandana : అంతర్జాతీయ టీ20ల్లో ఓ అద్భుతం నమోదైంది. ఓ బౌలర్ ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు. ఇండోనేషియాకు చెందిన గేడే ప్రియాందన ఈ ఘనత సాధించాడు.
మంగళవారం బాలీ వేదికగా ఇండోనేషియా, కంబోడియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఇండోనేషియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాందన తన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ పురుష, మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు లంక పేసర్ లసిత్ మలింగను అధిగమించాడు. 2019లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మలింగ ఒక ఓవర్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో ఇండోనేషియా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇండోనేషియా బ్యాటర్లలో ధర్మ కేశుమ (110; 68 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. అనంతరం 168 పరుగుల లక్ష్య ఛేదనలో కంబోడియా 15 ఓవర్లకు 106/5 స్కోరుతో ఉంది.
ఈ సమయంలో 16వ ఓవర్ను మీడియం పేసర్ అయిన ప్రియాందన వేశాడు. ఈ మ్యాచ్లో అతడికి ఇదే తొలి ఓవర్. మొదటి మూడు బంతుల్లో వరుసగా షా అబ్రార్ హుస్సేన్, నర్మల్జిత్ సింగ్, చాంతోయున్ రథనక్లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఇక ఐదు, ఆరు బంతుల్లో మాంగ్దారా సోక్, పెల్ వెన్నక్లను ఔట్ చేసి ఒకే ఓవర్లో ఐదు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో ఏడుగురు కంబోడియా బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం.
Pat Cummins : టీ20 ప్రపంచకప్ 2026లో పాట్ కమిన్స్ ఆడటం అనుమానమే!
ప్రియాందన ఈ ఘనత సాధించడానికి ముందు, పురుషుల దేశవాళీ T20 క్రికెట్లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు రెండుసార్లు మాత్రమే నమోదయ్యాయి. 2013-14లో విక్టరీ డే T20 కప్లో UCB-BCB XI తరపున అల్-అమీన్ హుస్సేన్ ఈ ఘనత సాధించగా, 2019-20లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ సెమీ-ఫైనల్లో కర్ణాటక తరపున అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించాడు.