ODI World Cup 2023 : పాక్ జట్టుకు మద్దతుగా నిలిచిన హర్భజన్ సింగ్.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కౌంటర్.. అలా ఎందుకంటే?
హర్భజన్ అభిప్రాయాన్ని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తప్పుబట్టారు. ఇందుకు కారణంగా.. ఇదే మ్యాచ్ లో 19వ ఓవర్ లో ఉసామా బౌలింగ్ లో సఫారీ బ్యాటర్ డసెన్ ఎల్బీగా వెనుదిరిగిన విషయాన్ని స్మిత్ ప్రస్తావించాడు.
- Harishth Thanniru
- Published On : October 28, 2023 / 02:45 PM IST
Harbhajan Singh
Pakistan Vs South Africa Match: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో వికెట్ తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం దక్కలేదు. చివరి వికెట్ విషయంలో డీఆర్ఎస్ ఫలితం అంపైర్స్ కాల్ గా రావడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
అసలేం జరిగిదంటే..
పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరిలో సఫారీ జట్టు విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో 46వ ఓవర్ లో హారిస్ రవూఫ్ వేసిన చివరి బంతికి షంసి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాకిస్థాన్ ప్లేయర్స్ అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే బాబర్ రివ్యూ తీసుకోగా.. రిప్లైలో అంపైర్స్ కాల్ గా తేలింది. బాల్ ట్రాకింగ్ లో బంతి లెగ్ స్టప్ ను లైట్ గా తాకిందని థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చారు. అయితే, ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ మాజీలు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. భారత్ మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ పాక్ కు మద్దతుగా నిలిచాడు.
Also Read : Babar Azam: అలా చేసుంటే మేం గెలిచేవాళ్లం.. సఫారీ జట్టుపై ఓటమి తరువాత బాబర్ అజామ్
హర్భజన్ కు గ్రేమ్ స్మిత్ కౌంటర్..
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ‘డీఆర్ఎస్ ఫలితం అంపైర్స్ కాల్’ వ్యవహారంపై స్పందించారు. తప్పుడు అంపైరింగ్, తప్పుడు నిబంధనల కారణంగా పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఓడిపోయిందన్నారు. ఐసీసీ ఈ నిబంధనను మార్చాలి. బంతి స్టంప్స్ ను తాకితే అది ఔటే. అంపైర్ ఔట్ ఇచ్చాడా? నాటౌట్ ఇచ్చాడా? అన్నది అనవసరం. లేదంటే, టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అని హర్భజన్ అన్నారు. తప్పుడు అంపైరింగ్ వల్లే పాకిస్థాన్ జట్టు ఓడిపోవాల్సి వచ్చిందని హర్భజన్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
హర్భజన్ అభిప్రాయాన్ని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తప్పుబట్టారు. ఇందుకు కారణంగా.. ఇదే మ్యాచ్ లో 19వ ఓవర్ లో ఉసామా బౌలింగ్ లో సఫారీ బ్యాటర్ డసెన్ ఎల్బీగా వెనుదిరిగిన విషయాన్ని స్మిత్ ప్రస్తావించాడు. అంపైర్స్ కాల్ పై నేనుకూడా హర్భజన్ లాగే అభిప్రాయ పడుతున్నా.. కానీ, వాండర్ డెసెన్, దక్షిణాఫ్రికా జట్టుకూడా ఇలాగే అనుకుంటుందా? అంటూ డసెన్ ఎల్బీని స్మిత్ ప్రస్తావించారు. దీనికి హర్భజన్ స్పందిస్తూ.. నా వరకు డసెన్ నాటౌటే. కానీ, అంపైర్ ఔట్ ఇచ్చాడని టెక్నాలజీకూడా అదే ఫలితం ఇచ్చింది. వాళ్లు ఆటగాళ్లను కాదు అంపైర్ ను రక్షించారని హర్భజన్ అన్నారు.
