IND vs WI 2nd T20 : వెస్టిండీస్తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచులు ముగిశాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత జట్టు ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్లో 0-2 తో వెనుకబడి ఉంది. టీమ్ఇండియా సిరీస్ గెలవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా.. ఈ రెండు మ్యాచుల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన పూర్తి బౌలింగ్ కోటాను వేయలేదు.
కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్లో చాహల్ను వినియోగించుకుంటున్న తీరు క్రికెట్ పండితులతో పాటు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చాహల్పై హార్దిక్కు నమ్మకం లేదా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. మొదటి టీ20 మ్యాచ్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చాడు చాహల్. అయితే.. వెంటనే ఇంకో ఓవర్ ఇవ్వకుండా ఏకంగా ఎనిమిది ఓవర్ల తరువాత అతడి చేత బౌలింగ్ చేయించాడు కెప్టెన్ పాండ్య. మొత్తంగా మ్యాచ్ ముగిసే సరికి కేవలం మూడు ఓవర్లను మాత్రమే చాహల్ వేశాడు.
ఇక రెండో టీ20ల్లోనూ చాహల్ మూడు ఓవర్లే వేశాడు. రెండు వికెట్లు తీసినప్పటికీ అతడితో పూర్తి ఓవర్ల కోటా వేయించలేదు. అటు ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. దీనిపై మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, ఆకాశ్ చోప్రా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వసీం జాఫర్ మాట్లాడుతూ.. రెండో టీ20 మ్యాచులో కెప్టెన్ పాండ్య బౌలర్లను ఉపయోగించుకున్న తీరు తనకు అర్థం కాలేదన్నాడు. రెండు వికెట్లు తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చాహల్ చేత పూర్తి కోటా వేయించలేదన్నాడు. భవిష్యత్ కెప్టెన్ పాండ్యనే అని వినిపిస్తున్న తరుణంలో అతడి నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాహల్, అక్షర్ పటేల్లపై నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంది అని జాఫర్ అన్నాడు.
IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం.. వరుసగా రెండు టీ20ల్లో గెలుపు
ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. భారత అత్యుత్తమ స్పిన్నర్లలో చాహల్ ఒకడు అని అన్నారు. రెండో టీ20 మ్యాచ్లో 16వ ఓవర్ వేసిన చాహల్ రెండు వికెట్లు తీసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాంటి సమయంలో అతడికి 18 లేదా 19 ఓవర్ వేసే అవకాశం ఇవ్వాల్సి ఉందన్నాడు. ఒకవేళ అతడు తన పూర్తి ఓవర్ల కోటా వేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు.