Hardik Pandya
Hardik Pandya- IND Vs WI: వెస్టిండీస్ (West Indies) క్రికెట్ బోర్డుపై టీమిండియా స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు తగ్గ సౌకర్యాలు కల్పించడంలో మరింత శ్రద్ధ పెట్టాలని అన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
టీమిండియా బ్యాటర్లు శుభ్మన్ గిల్ (85), ఇషాన్ కిషన్ (77), హార్దిక్ పాండ్యా (70 నాటౌట్), సంజూ శాంసన్ (51) ధాటిగా ఆడడం, అలాగే భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇండియా 200 పరుగులతో భారీ విజయం సాధించింది. వన్డే సిరీస్ ను 2-1 తేడాతో భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడాడు.
” ఈ గ్రౌండ్ చాలా బాగుంది. అయితే, మేము మరోసారి వెస్టిండీస్ పర్యటనకు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులు బాగుపడితే బాగుంటుంది. దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నాను. మేమేం లగ్జరీని అడగడం లేదు. కొన్ని ప్రాథమిక అవసరాలను మాత్రమే మేము అడుగుతున్నాం ” అని హార్దిక్ పాండ్యా అన్నాడు.