న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తప్పిదం కారణంగా జట్టు స్కోరులో ఓ పరుగు కోత పడింది. నీషమ్ బౌలింగ్ చేస్తున్న ఇన్నింగ్స్ 49వ ఓవర్లో తొలి రెండు బంతుల్ని 4, 6గా మలచిన హార్దిక్ (45) నాలుగో బంతిని ఆన్సైడ్ దిశగా హిట్ చేశాడు. అయితే ఫీల్డర్ అక్కడే ఉండటంతో వేగంగా పరుగు పూర్తి చేశాడు. మళ్లీ తానే స్ట్రైక్ తీసుకోవాలనే ప్రయత్నంలో రెండో పరుగుని కూడా పూర్తి చేశాడు. కానీ.. కంగారులో నాన్స్ట్రైక్ ఎండ్లో బ్యాట్ని జారవిడిచేశాడు.
బ్యాట్ని ఉంచే క్రమంలో హార్దిక్ పాండ్య చేతి నుంచి బ్యాట్ పట్టుజారింది. బ్యాట్ క్రీజులోకి జారే సమయంలో తన శరీరానికి తాకి ఉందని భ్రమించాడు. కానీ.. ఆ క్షణంలో బ్యాట్తో అతనికి కాంటాక్ట్ మిస్ అయింది. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోగా.. లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ గుర్తించి అంపైర్కి ఫిర్యాదు చేశాడు. దీంతో.. థర్డ్ అంపైర్ని ఆశ్రయించిన ఫీల్డ్ అంపైర్.. రిప్లైని పరిశీలించిన తర్వాత భారత్ స్కోరు నుంచి ఒక పరుగు కోత విధించాడు.
ఆ తర్వాత బంతికి ఫోర్ బాదిన పాండ్య ఓవర్లో ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో స్పిన్నర్ ఆస్లే బౌలింగ్లో హార్దిక్ పాండ్య వరుసగా 6, 6, 6తో మెరిశాడు. మ్యాచ్లో అంబటి రాయుడు (90), హార్దిక్ పాండ్య (45) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో ఆలౌటై కివీస్కు 253 పరుగల టార్గెట్ ఇచ్చింది.