Harmanpreet Kaur : సెమీస్లో అడుగుపెట్టిన భారత్.. హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్.. ఆ ఇద్దరే..
వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన తరువాత న్యూజిలాండ్ పై గెలుపొందడం పై హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) స్పందించింది.
- Thota Vamshi Kumar
- Published On : October 24, 2025 / 09:12 AM IST
Harmanpreet Kaur comments after Team India beat New Zealand in Womens World Cup 2025
Harmanpreet Kaur : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ఇండియా సెమీఫైనల్ చేరుకుంది. గురువారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్లూయిస్ పద్దతిలో 53 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
ఈ మ్యాచ్లో తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ప్రతీక రావల్ (122; 134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మృతి మంధాన (109; 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్; 55 బంతుల్లో 11 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
Shubman Gill : రోహిత్ శర్మ పై గిల్ కామెంట్స్.. అతడు మిస్సైయ్యాడు.
ఆ తరువాత డక్వర్త్ లూయిస్ పద్దతిలో న్యూజిలాండ్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో బ్రూక్ హాలిడే (81; 84 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా గేజ్ (65 నాటౌట్; 51 బంతుల్లో 10 ఫోర్లు), అమేలియా కెర్ (45; 53 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, కాంత్రి గౌడ్లు చెరో రెండు వికెట్లు తీశారు. ప్రతీకా రావల్ ఓ వికెట్ సాధించింది.
గెలుపు గీతను దాటలేకపోయాం..
ఈ మ్యాచ్లో విజయం సాధించడం పట్ల టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన తరువాత ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో జట్టు మొత్తానికి తెలుసునని అంది. జట్టు పోరాడిన తీరు అద్భుతం అని చెప్పుకొచ్చింది. గత మూడు మ్యాచ్ల్లో కూడా తాము విజయానికి దగ్గరగా వచ్చినప్పటికి కూడా గెలుపు అంచును దాటలేకపోయామంది.
ఓపెనర్లు స్మృతి, ప్రతీకా లు బాధ్యత తీసుకుని ఆడారని, వారిద్దరికే గెలుపులో ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని తెలిపింది. ‘ఓపెనర్లు తొలి వికెట్కు 200 పై చిలుకు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తరువాత రోడిగ్స్ లేదా నేను.. మా ఇద్దరిలో ఒకరు బ్యాటింగ్కు వెళ్లాలని అనుకున్నాం. జెమీమా అద్భుతంగా ఆడింది. ఆమె నుంచి అందరూ అదే ఆశిస్తూ ఉంటారు.’ అని హర్మన్ తెలిపింది.
Rohit Sharma : సెంచరీ మిస్.. అయితేనేం గంగూలీ రికార్డును మాత్రం మిస్కానీ రోహిత్ శర్మ..
ఇక స్వదేశంలో ప్రపంచకప్ ఆడుతుండడం కాస్త ఒత్తిడిగా అనిపించడం లేదా అనే ప్రశ్నపై హర్మన్ ఇలా స్పందించింది. స్వదేశంలో ఇలాంటి మెగా టోర్నీలు ఆడుతున్నప్పుడు అందరూ జట్టు నుంచి చాలా ఎక్కువ ఆశిస్తారని చెప్పుకొచ్చింది. ఇక ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉంటుందని తెలిపింది. ఇది తమని ఒత్తిడికి గురి చేయదని, దీన్ని తాము ఆస్వాదిస్తామని వెల్లడించింది.
ఇక మిగిలిన మ్యాచ్ల్లోనూ ఇదే విధంగా ఆడేందుకు కృషి చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లను తీసుకుంటే బ్యాటింగ్ విభాగం రాణించింది. అయితే.. బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని తెలిపింది.
