IND vs ENG : భారత్ పై సిరీస్ విజయం.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కామెంట్స్ వైరల్.. ఇంకా అయిపోలేదు..
భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే (IND vs ENG) ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- July 10, 2026 / 08:31 AM IST
Harry Brook comments after England win against India in 4th T20 match
- మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ పై సిరీస్ విజయం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన హ్యారీ బ్రూక్
- తమ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని వెల్లడి
IND vs ENG : భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ ఇంగ్లాండ్ గెలుపొందింది. కాగా.. భారత్ పై సిరీస్ విజయం సాధించడం పట్ల ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
నాలుగో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (80 నాటౌట్; 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లు చెరో రెండు వికెట్లు సాధించారు. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ (79 నాటౌట్; 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (59 నాటౌట్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలు చేయడంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేదించింది. ఇంగ్లాండ్ కోల్పోయిన ఏకైక వికెట్ ను అర్ష్దీప్ సింగ్ పడగొట్టాడు
మా లక్ష్యం అదే..
మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. భారత్ వంటి బలమైన జట్టును 3-0 తేడాతో ఓడించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవడం ఎంతో గొప్ప విజయంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్లో పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా వ్యూహాలు అమలు చేశామన్నాడు.
జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తమ పాత్రను చాలా చక్కగా నిర్వర్తించారని తెలిపాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్లో అద్భుతంగా రాణించారని, పిచ్కు తగ్గట్టుగా ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో పరస్పరం చర్చించుకుంటూ ముందుకు సాగారన్నాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్పిన్నర్లకు సరైన సూచనలు ఇవ్వడంతో పాటు స్టంప్స్ వెనుక నుంచి జట్టుకు విలువైన సేవలు అందించాడని కొనియాడాడు. చిన్న చిన్న చర్చలే మ్యాచ్ ఫలితాన్ని మార్చగలవని ఈ సిరీస్ మరోసారి నిరూపించిందని అభిప్రాయపడ్డాడు.
ఇక టీ20 ర్యాంకింగ్స్లో నంబర్1గా నిలవడమే ప్రస్తుతం తమ లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. టీమ్ఇండియాను ఆఖరి మ్యాచ్లోనూ ఓడించి దాన్ని సాధించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆఖరి టీ20 మ్యాచ్లోనూ భారత్ ఓడిపోతే ఇంగ్లాండ్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
