T20 World Cup: ఐసీసీ(ICC) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు 2024లో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) కు యూఎస్ఏ(USA), వెస్టిండీస్(West Indies )లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ప్రపంచ కప్ వేదిక మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం యూఎస్ఏలో మౌలిక సదుపాయాలు లేకపోవడమే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024 వేదికను వెస్టిండీస్, యూఎస్ఏ నుంచి ఇంగ్లాండ్(England)కు మార్చాలని ఐసీసీ ఆలోచిస్తుందని సమాచారం.
వెస్టిండీస్ కు ఇప్పటికే మెగా టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన అనుభవం ఉంది. అయితే.. యూఎస్ఏ కు ఇదే తొలిసారి. యూఎస్ఏలోని మైదానాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐసీసీ ప్రమాణాలకు తగ్గట్లుగా లేదని తెలుస్తోంది. ప్రపంచకప్కు మరో 12 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా స్టేడియాలను సిద్ధం చేయడం యూఎస్ఏ కు సాధ్యం అయ్యే పని కాదు. అందుకే టోర్నీని ఇంగ్లాండ్ కు మార్చాలని ఐసీసీ భావిస్తోందట. ఇందుకు కూడా ఓ కారణం ఉంది. 2030లో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ పరిస్థితుల్లో 2024లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తే.. 2030లో యూఎస్ఏ, వెస్టిండీస్లకు ప్రపంచకప్ నిర్వహించే అవకాశాన్ని ఇవ్వాలని ఐసీసీ బావిస్తోందట. అప్పటి కల్లా యూఎస్ఏ మైదానాలను సిద్దం చేసుకునేందుకు సమయం సరిపోతుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
యూఎస్ఏలో కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్నాయి. అందులో ఒకటి ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ ఒకటి కాగా రెండోది టెక్సాస్లోని మూసా స్టేడియం. టీ20 ప్రపంచకప్ను నిర్వహించేందుకు మరికొన్ని స్టేడియాలు అవసరం. అందుకనే మరికొంత సమయం ఇస్తే ఆలోగా మిగిలిన స్టేడియాల్లో కూడా మెరుగైన వసతులు కల్పించే అవకాశం ఉన్నట్లు ఐసీసీ బావిస్తోంది.