ICC : భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే .. అలా చేస్తే..
భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ ( ICC) స్పందించింది.
- Thota Vamshi Kumar
- Published On : February 2, 2026 / 09:19 AM IST
ICC first reaction to Pakistan decision to boycott the T20 World Cup 2026 match against India
- టీ20 ప్రపంచకప్లో భారత్తో ఆడొద్దు..
- పీసీబీకి సూచించిన పాక్ ప్రభుత్వం
- స్పందించిన ఐసీసీ
ICC : టీ20 ప్రపంచకప్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్లో పాల్గొనకూడదని పాక్ ప్రభుత్వం తమ క్రికెట్ జట్టును ఆదేశించింది. దీనిపై తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది.
పాక్ ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని తెలిపింది. అయితే.. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదంది.
WPL 2026 : యూపీపై విజయం.. ఎలిమినేటర్కు ఢిల్లీ.. టోర్నీ నుంచి ముంబై ఔట్
‘పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మా దృష్టికి వచ్చింది. అయితే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. దీని కోసం ఎదురుచూస్తున్నాం. ఇలాంటి మెగాటోర్నీల్లో ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొనడం అనే వారి వైఖరి ఆమోదయోగ్యం కాదు. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం సమాన నిబంధనలతో పోటీ పడతాయని భావిస్తున్నాం. ‘అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రలను ఐసీసీ గౌరవిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయం ప్రపంచ క్రీడకు లేదా పాకిస్తాన్లోని లక్షలాది మందితో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మంచిది కాదని చెప్పింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం.. ఆ దేశంలోని క్రికెట్ పై దీర్షకాలిక ప్రభావాలను చూపే అవకాశం ఉందని, కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలని కోరింది.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ను విజయవంతంగా నిర్వహించడం ఐసీసీ బాధ్యత మాత్రమే కాదని, సభ్యులందరి బాధ్యత అని చెప్పింది. పీసీబీ పరస్పరం ఆమోదయోగ్యమైన తీర్మానాన్ని అన్వేషించాలని, ఇది అన్ని వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ఆశిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.
