WTC Final 2023: భారత్ – ఆస్ట్రేలియా ఫైనల్ పోరుకు రెండు పిచ్లు సిద్ధం, ఓవల్ మైదానంలో భారీ భద్రత.. ఎందుకో తెలుసా?
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఓవల్ మైదానంలో ఐసీసీ రెండు పిచ్లను సిద్ధం చేసింది. అంతేకాదు, మైదానం చుట్టూ, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
- Harishth Thanniru
- Published On : June 7, 2023 / 12:16 PM IST
WTC Final
ICC WTC Final: క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్( Final) మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. లండన్లోని ఓవల్ మైదానంలో ఇవాళ్టి నుంచి 11వ తేదీ వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమ్ ఇండియా(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు మ్యాచ్ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకావాల్సి ఉండగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్లో ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిర్ణయం అభిమానులను కొంత గందరగోళానికి గురిచేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఓవల్ మైదానంలో ఐసీసీ రెండు పిచ్లను సిద్ధం చేసింది. అంతేకాదు, మైదానం చుట్టూ, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఆందోళనకారులు దాడిచేసే అవకాశం ఉండటంతో ఐసీసీ ఈ చర్యలు చేపట్టింది. ఐసీసీ చర్యలపట్ల క్రికెట్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఇంగ్లాండ్ లో చమురు ధరల పెంపుపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులు మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. దీనికితోడు ఇప్పటికే నిరసన కారులు గ్రౌండ్ను ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఐసీసీ ఈ చర్యలకు పూనుకుంది. మైదానంలో ప్రత్యామ్నాయ పిచ్ ను తయారు చేయడం కోసం ప్లెయింగ్ కండిషన్ రూల్లోని సెక్షన్ 6.4లో పాలకమండలి మార్పులు చేసింది.
ఐసీసీ భావించినట్లుగా ప్రధాన పిచ్ పై ఆందోళనకారులు దాడిచేస్తే రెండో పిచ్ ను వినియోగిస్తారు. అందుకు నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. పిచ్ కండిషన్ ఆడటానికి అనువుగా ఉందా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ పిచ్ ఆడటానికి అనువుగా లేకుంటే ఇరు జట్ల కెప్టెన్ల నిర్ణయం ఆధారంగా రెండో పిచ్ను ఉపయోగించాలా? ఆటను రద్దు చేయాలా అనేది నిర్ణయిస్తారు. రెండో పిచ్ ఆప్షన్గా మాత్రమే ఉంటుంది. మొదటి పిచ్ దెబ్బతిన్నది కదా అని నిబంధనలకు విరుద్ధంగా రెండో పిచ్పై ఏకపక్షంగా మ్యాచ్ నిర్వహించే అధికారం ఎవరికీ ఉండదు. అందరి అభిప్రాయాలు, ముఖ్యంగా ఇరు జట్ల కెప్టెన్ల నిర్ణయం ఆధారంగానే రెండో పిచ్ వినియోగం ఉంటుంది.
