ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. మ్యాచ్ అనంతరం నితీశ్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్.. అతని సూచనలు బాగా పనిచేశాయ్ అంటూ..

ఇంగ్లాండ్ వర్సెస్ భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు గట్టి షాకిచ్చాడు.

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ భారత జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, తొలిరోజు ఆటలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్ తో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ కు బ్రేక్ అందించాడు.

Also Read: IND vs ENG: బాబులూ భయపడ్డారా.. బజ్‌బాల్ ఎక్కడ..? టుక్ టుక్.. ఏందీఆట..! ఇంగ్లాండ్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్న సిరాజ్, గిల్.. వీడియోలు వైరల్

టీమిండియా పేసర్లు జస్ర్పీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ లు మ్యాచ్ ప్రారంభంలో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఆ సమయంలో బాల్ అందుకున్న నితీశ్ రెడ్డి పదునైన పేస్, స్వింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచ్ లో 14వ ఓవర్ ను నితీశ్ రెడ్డి వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతికి బెన్ డకెట్ (23) కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ (18) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ జట్టు తొలిరోజు ఆటలో పట్టుసాధించేలా నితీశ్ రెడ్డి దోహదపడ్డాడు. అయితే, మ్యాచ్ అనంతరం నితీశ్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.


‘‘గత ఆస్ట్రేలియా పర్యటన అనంతరం నా బౌలింగ్ లో మరింత నాణ్యత అవసరమని భావించా. నిలకడగా బంతులేయడంపై దృష్టి పెట్టా. ఐపీఎల్‌లో పాట్ కమిన్స్ నాయకత్వంలో ఆడా.. ఆ సమయంలో అతడిని పదేపదే టిప్స్ అడిగేవాడ్ని. అతను కూడా నా బౌలింగ్ మెరుగుపర్చుకునేందుకు చాలా సూచనలు చేశాడు. ఆసీస్, ఇంగ్లాండ్ పిచ్ ల్లో పెద్దగా మార్పులు ఉండవు. అయితే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకుంటూ ఉండాలి. మరోవైపు.. తన అద్భుత ప్రదర్శన వెనుక భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ పాత్ర కూడా ఉంది. కమిన్స్, మోర్కెల్ సూచనలు బాగా పనిచేశాయి’’ అంటూ నితీశ్ రెడ్డి చెప్పారు.