Courtesy @ ESPNCricinfo
Ind Vs SA: విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో దుమ్మురేపింది. 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 271 పరుగుల టార్గెట్ ను టీమిండియా.. మరో 10.1 ఓవర్లు ఉండగానే.. ఛేజ్ చేసింది. 39.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 271 రన్స్ చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 121 బంతుల్లో 116 రన్స్ (నాటౌట్) చేశాడు. 2 సిక్సులు, 12 ఫోర్లు బాదాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలతో మెరిశారు. రోహిత్ 73 బంతుల్లో 75 పరుగులు, విరాట్ కోహ్లి 45 బంతుల్లో 65 రన్స్ చేశారు. తొలి రెండు వన్డేల్లో ఫెయిల్ అయిన జైస్వాల్.. కీలకమైన చివరి మ్యాచులో చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. జైస్వాల్ కు వన్డేల్లో ఇదే తొలి శతకం.
రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి మరోసారి దూకుడుగా ఆడాడు. వేగంగా పరుగులు చేశాడు. జైస్వాల్ లో కలిసి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
స్కోర్లు..
సౌతాఫ్రికా – 270
భారత్ – 39.5 ఓవర్లలో 271/1