ICC World Cup 2023: సందిగ్ధంలో భారత్, పాక్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్.. క్లారిటీ ఇవ్వని పీసీబీ
అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది.. వరల్డ్ కప్కే హైలైట్ మ్యాచ్. అయితే.. నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించడంపై పాక్ గుర్రుగా ఉంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : June 29, 2023 / 01:03 PM IST
India vs Pakistan ODI World Cup 2023 Schedule
ICC ODI World Cup 2023 టోర్నీ ఏదైనా.. హోస్ట్ కంట్రీగా ఏ దేశం ఉన్నా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ (India vs Pakistan) అంటే మొత్తం లెక్కలే మారిపోతాయ్. ఇక.. అది వరల్డ్ కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో దాయాదుల పోరు అంటే.. మరింత రసవత్తరమే. పైగా.. ఈసారి వరల్డ్ కప్కు భారత్ హోస్ట్ కంట్రీగా ఉండటం మరింత ఆసక్తి రేపుతోంది. అయితే.. ఇండియా-పాక్ మ్యాచ్కు అహ్మదాబాద్(Ahmedabad)ను వేదికగా ఎంపిక చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. దాంతో భారత్లో జరిగే వరల్డ్కప్ మ్యాచ్ల్లో.. దాయాది దేశం పాల్గొంటుందా? లేదా? అన్నదే హాట్ టాపిక్ (Hot Topic)గా మారింది.
క్రీడలు, రాజకీయాల విషయంలో.. మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా.. భారత్-పాకిస్థాన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం.. మొత్తం విషయమే మారిపోతుంది. ఆ రెండు అంశాల మధ్య ఉండే సన్నని గీత.. చాలా పెద్ద చర్చకే దారితీస్తుంది. పైగా.. ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. రాజకీయంగానూ హీట్ పెరుగుతుంది. కానీ.. ఇటీవల ఆసియా కప్ టోర్నీలో భాగంగా.. పాకిస్థాన్లో జరిగే మ్యాచ్లను భారత్ బహిష్కరించింది. దాంతో ఈసారి ఇండియాలో జరిగే వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ల్లో పాకిస్థాన్ పాల్గొంటుందా? లేదా? అనేది బర్నింగ్ టాపిక్గా మారింది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలో.. మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ని కూడా ఐసీసీ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న.. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంది. దీనికోసం.. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియని.. వేదికగా నిర్ణయించారు. ఇదే.. ఇప్పుడు కొత్త చర్చకు దారీసింది. ఎందుకంటే.. ఆసియా కప్ టోర్నమెంట్లో.. పాకిస్థాన్లో మ్యాచ్లు ఆడబోమని.. తటస్థ వేదికైన శ్రీలంకను.. బీసీసీఐ ఎంచుకుంది. దాంతో.. భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించారు. దీనిని.. పాక్ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు.. ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహిస్తుండటంతో.. తామూ భారత్లో ఆడే విషయాన్ని ఆలోచిస్తామంటూ.. పాక్ సంకేతాలిస్తోంది.
అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది.. వరల్డ్ కప్కే హైలైట్ మ్యాచ్. అయితే.. నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించడంపై పాక్ గుర్రుగా ఉంది. చెన్నై, కోల్ కతా లాంటి వేదికలు అయితే అభ్యంతరం ఉండేది కాదని.. కావాలనే అహ్మదాబాద్ను వేదికగా ఎంపిక చేశారని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలంటున్నాయి. అహ్మదాబాద్లో ఎవరి ప్రభావం ఉంటుందో.. ప్రతి ఒక్కరికీ తెలుసని అంటున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (Pakistan Cricket Board) ఛైర్మన్ నజమ్ సేత్ దీనిపై స్పందిస్తూ.. పాకిస్తాన్ భారత్లో వరల్డ్ కప్ ఆడే విషయంలో.. నిర్ణయం తీసుకోవాల్సిందిగా తమ ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. వారి అనుమతిని బట్టే.. భారత్తో మ్యాచ్ ఆడే విషయంలో తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని.. ఐసీసీకి పీసీబీ కూడా తెలియజేసింది.
Also Read: సచిన్ చాలా బరువు.. భుజాలపై మోయడమా.. మా వల్ల కాదన్నాం.. అయితే కోహ్లి మాత్రం..
అయితే.. రాజకీయ కారణాలు చూపి.. భారత్లో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించే ధైర్యం పాక్ చేస్తుందా? అనే సందేహాలు వస్తున్నాయ్. కానీ.. ఏ రంగమైనా ముందు బెదిరించడం అలవాటేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు.. క్రికెట్ మ్యాచ్ల విషయంలోనూ ఇదే పద్ధతిని పాక్ అనుసరిస్తోందంటున్నారు. మిగతా టోర్నీలంటే ఆటకు దూరంగా ఉన్నా పెద్దగా ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు. కానీ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని బాయ్ కాట్ చేసి భారత్ లో ఆడలేమని చెప్పే సాహసం పాకిస్థాన్ చేయదని క్రీడారంగ విశ్లేషకులు అంటున్నారు.
