India Vs Sri Lanka Asia Cup 2022 : ఆసియా కప్ లో తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేసింది. శ్రీలంకకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ 41 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 34 పరుగులు) పర్లేదనిపించాడు. పాండ్యా (17), పంత్ (17), అశ్విన్(15) పరుగులు చేశారు. విరాట్ కోహ్లి డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. భువనేశ్వర్ కుమార్ కూడా డకౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (6), దీపక్ హుడా (3) విఫలం అయ్యారు. లంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 3 వికెట్లు తీశాడు. కరుణరత్నె, డాసు
న్ శనక తలో రెండు వికెట్లు తీశారు. మహీశ్ తీక్షణ ఒక వికెట్ తీశాడు.
లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఆదిలోనే భారత్ కు గట్టి షాక్ లు తగిలాయి. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. దిల్షాన్ మదుశంక బౌలింగ్లో కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన లంక కెప్టెన్ డాసున్ శనక బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు తుది జట్టులో స్థానం దక్కింది. రవి బిష్ణోయ్ బదులు అశ్విన్ వచ్చాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద విజయంతో ఆసియా కప్ను ఘనంగా ప్రారంభించిన భారత్.. సూపర్-4 దశలో మాత్రం పాక్ చేతిలో ఓటమిపాలైంది. మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లంకపై టీమిండియానే కాస్త పైచేయి సాధించేలా ఉన్నప్పటికీ.. టీ20ల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అంచనా వేయలేము అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.