Asian Games: ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం.. శ్రీలంకపై భారత్ ఉమెన్స్ జట్టు ఘన విజయం
ఆసియా గేమ్స్ 2023లో భారత్ హవా కొనసాగుతుంది. టీమిండియా ఉమెన్స్ జట్టు శ్రీలంక ఉమెన్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
- Harishth Thanniru
- Published On : September 25, 2023 / 02:56 PM IST
Asian Games 2023,
India Women vs Sri Lanka Women Final Match: ఆసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. టీమిండియా ఉమెన్స్ జట్టు శ్రీలంక ఉమెన్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో భారత్ ఆసియా క్రీడల్లో రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం ఇండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 116 పరుగులు చేసింది. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో కేవలం 97 పరుగు మాత్రమే శ్రీలంక ఉమెన్స్ జట్టు చేయగలిగింది. దీంతో 19 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి భారత్ జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఎయిర్ రైఫిల్ టీమ్ వరల్డ్ రికార్డ్.. మొదటి స్వర్ణ పతకం
టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లలో స్మృతీ మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. షఫాలీ వర్మ (9), రిచా ఘోష్ (9), హర్మన్ ప్రీత్ కౌర్ (2), పూజా వస్త్రాకర్ (2) తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. దీంతో భారత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ఉదేశిక ప్రబోధని, సుగందిక కుమారి, ఇనోక రణవీర రెండేసి వికెట్లు పడగొట్టారు. 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి శ్రీలంక జట్టులో ఒకరిద్దరు మినహా ఎవరూ రాణించలేక పోయారు. భారత్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
Asian Games 2023: పతకం ఖాయమైంది.. బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ జట్టు
శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఆటపట్టు (12), అనుష్క సంజీవని (1), విష్మి గుణరత్నే(0) వరుస ఓవర్లలో ఔట్ కావడంతో కేవలం 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. హాసిని పెరీరా (25), నీలాక్షి డిసిల్వా (23),ఓషది రణసింగ్ (19) భారీ స్కోర్ చేసే ప్రయత్నంలో పెవిలియన్ బాట పట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక జట్టు కేవలం 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో టిటాస్ సాధు మూడు వికెట్లుతీయగా, రాజేశ్వరి గైక్వాడ్ రెండు, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య తలో వికెట్ తీశారు.
ఇదిలాఉంటే ఇప్పటికే ఆసియా క్రీడల్లో భారత్ 10 మీటర్ల పరురుషుల ఎయిర్ రైఫిల్ జట్టు మొదటి స్వర్ణ పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. భారత్ ఉమెన్స్ జట్టు ఫైనల్స్ లో విజయంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది.
