pic credit @ bcci twitter
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగు అయ్యాయి. పాకిస్తాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్ర్కమించింది.
శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్మన్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. రోహిత్ శర్మ (20) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా లు చెరో ఓ వికెట్ సాధించారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ ( 62; 76 బంతుల్లో 5 ఫోర్లు) అర్థశతకం సాధించాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు), ఖుష్దిల్ షా (38) లు రాణించగా బాబర్ ఆజామ్ (23)లు ఫర్వాలేదనిపించారు.
ఇమామ్ ఉల్ హక్ (10), ఆఘా సల్మాన్ (19), తయ్యబ్ తాహిర్ (4)లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు తలా ఓ వికెట్ సాధించారు.