IPL 2026 playoffs : రేసులోనే పంజాబ్.. ముంబైపైనే ఆశలన్నీ.. కోల్కతాకూ చాన్స్.. ఫోర్త్ ప్లేస్ ఎవరిదో..? అలా జరిగితే పంజాబ్కు పండగే..
IPL 2026 playoffs : ఐపీఎల్ 2026 టోర్నీ రసవత్తరంగా మారింది. ప్లేఆఫ్స్ రేసులో నాలుగో స్థానంకోసం మూడు జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే, ఆ మూడు జట్లలో ఏ జట్టు పాయింట్ల పట్టికలో నాల్గో స్థానాన్ని ఆక్రమిస్తుందనేది నేటితో తేలిపోనుంది.
- Harish Thanniru
- Updated on- May 24, 2026 / 08:08 AM IST
IPL 2026 playoffs
- రసవత్తరంగా ఐపీఎల్ 2026టోర్నీ
- ప్లేఆఫ్స్కోసం మూడు జట్ల మధ్య పోటీ
- ముంబై వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్పైనే అందరి చూపు
IPL 2026 playoffs : ఐపీఎల్ -2026 టోర్నీ రసవత్తరంగా మారింది. ప్లేఆఫ్స్ (playoffs) రేసులో నాలుగో స్థానంకోసం మూడు జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ (Punjab Kings) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఫోర్త్ ప్లేస్కు చేరింది.
Also Read : Rajat Patidar : ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్.. 100 సిక్సర్ల వీరుడు.. ఏకైక భారత ఆటగాడు..
అయితే, ఫోర్త్ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్టు కూడా పోటీపడుతున్నాయి. ఇవాళ్టితో లీగ్ దశలో మ్యాచ్లు పూర్తికానున్నాయి. ఇవాళ ముంబై జట్టుపై రాజస్థాన్ విజయం సాధిస్తే నేరుగా ఫోర్త్ ప్లేస్కు దూసుకెళ్తుంది. రాజస్థాన్ ఓడిపోయి.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కోల్కతా విజయం సాధిస్తే.. రన్రేట్ ఆధారంగా పంజాబ్, కోల్కతా జట్లలో ఏదో ఒకటి ఫోర్త్ప్లేస్కు చేరుతుంది. ఒకవేళ ముంబై జట్టుపై రాజస్థాన్ ఓడిపోయి.. ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కతా ఓడిపోతే.. పంజాబ్ కింగ్స్ నాల్గో స్థానంలో ప్లేఆఫ్స్ కు చేరుతుంది. మొత్తానికి మరికొద్ది గంటల్లో ఐపీఎల్ -2026లో ఫోర్త్ ప్లేస్ ఎవరిదో తేలిపోనుంది.
పంజాబ్, కోల్కతా ఆశలన్నీ ముంబై ఇండియన్స్పైనే ఉన్నాయి. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టును ముంబై ఇండియన్స్ ఓడిస్తే ఆ రెండు జట్లు రేసులోకి వస్తాయి. లేదంటే 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ముందంజ వేస్తుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్కు మెరుగైన అవకాశం ఉంటుంది. ఇప్పటికే 15 పాయింట్లతో పాటు మెరుగైన రన్రేటు కలిగిఉన్న ఆ జట్టును అధిగమించి ప్లేఆఫ్స్ చేరాలంటే.. కోల్కతా భారీ తేడాతో ఢిల్లీని ఓడించాలి. ఏదేమైనా లీగ్ దశలో ఆఖరి రోజు రసవత్తరంగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్ చేరాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ సన్రైజర్స్ జట్లు 18 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. బెంగళూరు, గుజరాత్ జట్లు తొలి మ్యాచ్లో తలపడనుండగా.. ఇవాళ ఫోర్త్ప్లేస్లో చేరే జట్టుతో హైదరాబాద్ తలపడనుంది.
