Jasprit Bumrah : బుమ్రా ప్రాక్టీస్.. రోజుకు ఏడు ఓవర్ల బౌలింగ్.. రీ ఎంట్రీకి సిద్ధమా..!
ఈ ఏడాది మార్చిలో బుమ్రా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు బుమ్రా ఏడు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేస్తున్నాడట.
- Thota Vamshi Kumar
- Published On : June 28, 2023 / 09:43 PM IST
Jasprit Bumrah
Jasprit Bumrah at NCA : ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5 న టోర్నీ ప్రారంభం కానుండగా టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న జరగనుంది. మొత్తం పది జట్లు కప్పు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి.
ప్రపంచకప్కు సమయం దగ్గర పడుతుండడంతో బెస్ట్ టీమ్ను ఎంపిక చేసే పనిలో పడింది బీసీసీఐ. ప్రపంచకప్ కంటే ముందు టీమ్ఇండియా వెస్టిండీస్, ఐర్లాండ్ సిరీస్లతో పాటు ఆసియా కప్లో ఆడనుంది. దీంతో ఈ టోర్నీల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ తుది జట్టు పై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధాన ఆటగాళ్లు అయిన కేఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు గాయపడడంతో ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు. ఈ ఆటగాళ్లు ప్రపంచకప్ సమయాని కల్లా పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డారు.
TNPL : మైండ్ ఎక్కడ పెట్టారయ్యా..! రనౌట్ అయినా పట్టించుకోలే.. బ్యాటర్ బచ్గయా
ఈ ఏడాది మార్చిలో బుమ్రా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు బుమ్రా ఏడు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేస్తున్నాడట. వెన్నుగాయం నుంచి కోలుకోవడం అంత సులభం కాదని, ఫలానా సమయం కల్లా పూర్తిగా కోలుకుంటాడని చెప్పడం కష్టమని ఎన్సీఏ వర్గాలు వెల్లడించాయి. బుమ్రా బాగానే కోలుకుంటున్నాడని, ప్రతి రోజు అతడు ఏడు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేస్తున్నట్లు తెలిపాయి. క్రమంగా అతడిపై పని భారాన్ని పెంచుతున్నారని, వచ్చే నెలలో కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడించి అతడి ఫిట్నెస్పై ఓ అంచనా రానున్నట్లు చెప్పాయి.
IRE vs IND : వెస్టిండీస్ పర్యటన అనంతరం.. ఐర్లాండ్కు టీమ్ఇండియా.. షెడ్యూల్ ఇదే
ఇక.. బుమ్రా పునరాగమనం పట్ల తొందరపాటు పనికి రాదని టీమ్ఇండియా మాజీ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్ రామ్జీ శ్రీనివాసన్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే కంటే ముందు బుమ్రాను దేశవాలీ మ్యాచుల్లో ఆడించాలని సూచించాడు. బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు కోలుకుని ప్రపంచకప్ బరిలోకి దిగితే టీమ్ఇండియాకు మరింత లాభం కానుంది.
