Jitesh Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సమరానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం(మార్చి 22) నుంచి ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచనున్నాయి. ఈ సీజన్లో అన్ని జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. కొన్ని జట్లకు కెప్టెన్లు కూడా మారారు. కీలక ఆటగాళ్లు కూడా అటు ఇటు మారారు. మెగా టోర్ని ఆరంభానికి ముందు కెప్టెన్ల ఫోటోషూట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
పంజాబ్ కింగ్స్ కొత్త వైస్ కెప్టెన్ని ప్రకటించింది. యువ ఆటగాడు జితేష్ శర్మను వైస్ కెప్టెన్గా నియమించింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ బదులుగా జితేష్ శర్మ ఫొటో షూట్ లో పాల్గొనడంతో ఈ విషయం బయటపడింది. ముందుచూపుతో జితేష్ శర్మను శిఖర్ ధవన్ డిప్యూటీగా పంజాబ్ ఫ్రాంచైజీ ఎంపిక చేసినట్టు కనబడుతోంది. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల జితేష్ శర్మ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. అతడు ఇప్పటివరకు 26 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 543 పరుగులు చేశాడు. 9 ట్వి20 మ్యాచ్లు ఆడి 100 పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. 23న ముల్లన్పూర్లోని కొత్త స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫొటో షూట్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరో తెలుసా?