IND vs ENG : తెలుగోడిపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు..
ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో (IND vs ENG) తీవ్ర సతమతం అవుతోంది
- Thota Vamshi Kumar
- Updated on- July 9, 2026 / 03:54 PM IST
Krishnamachari Srikkanth comments on Tilak Varma ahead of IND vs ENG 4th T20 match
- వరుసగా విఫలం అవుతున్న తిలక్ వర్మ
- తెలుగోడి పై శ్రీకాంత్ విమర్శలు
- అతడి స్థానంలో సంజూకు ఛాన్స్ ఇవ్వాలని సూచన
IND vs ENG : ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర సతమతం అవుతోంది. తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండు, మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో నాలుగో టీ20 మ్యాచ్కు భారత్ సిద్ధం అవుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలబడాలని టీమ్ఇండియా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ప్రపంచకప్ విజయానంతరం భారత జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులోనూ చోటు ఇవ్వలేదు. అలాగే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఈ మార్పుల తర్వాత జట్టు ప్రదర్శన పూర్తిగా దిగజారడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం వరుసగా విఫలం కావడంతో కొత్త నాయకత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
MS Dhoni : వయసు అయిపోయింది.. నడవలేకపోతున్నా.. ధోని కామెంట్స్ వైరల్..
వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తిలక్ 19, 55, 13, 24 నాటౌట్, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐర్లాండ్ పై చేసిన 55 పరుగులు మినహా మిగతా మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాల్సిందని శ్రీకాంత్ సూచిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు అనుభవజ్ఞుడైన బ్యాటర్ అవసరమని అంటున్నాడు.
తిలక్ వర్మ ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్ అని, భవిష్యత్తులో అతడు కెప్టెన్ కూడా అయ్యే అవకాశం ఉందన్నాడు. అతడు క్రీజులోకి వచ్చాక ఔట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆడుతున్నట్లుగా అనిపిస్తున్నాడు. అంతేకాకుండా అతడు ఫాస్ట్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడని, ఈ విషయంలో అతడిని జట్టు మేనేజ్మెంట్ వెనకేసుకొస్తుందన్నాడు. ఇది ఏ మాత్రం సరైంది కాదన్నాడు.
తిలక్ వర్మ కంటే ముందు అక్షర్ పటేల్ను బ్యాటింగ్కు పంపిస్తున్నారని, ఇది చూస్తుంటే.. తిలక్ పై నమ్మకం లేదనే సంకేతాలు వెళ్లున్నాయని అనిపిస్తుందని విమర్శించాడు. అతడిని జట్టు నుంచి తప్పించాలని అన్నాడు. అప్పుడే అతడు మరింత మెరుగ్గా మారి వస్తాడని తెలిపాడు. కానీ మేనేజ్మెంట్ అలా చేయడం లేదు అని క్రిష్ అన్నాడు.
